బిహార్లోని పశ్చిమ చంపారన్ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. బెట్టియా సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
రహదారి పక్కన చిన్నారి పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఆర్కెస్ట్రా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అదే సమయంలో గోరఖ్పూర్ నుంచి బెట్టియా వైపు వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి ఆర్కెస్ట్రా కార్యక్రమం జరుగుతున్న ప్రదేశంపైకి దూసుకెళ్లింది.
ఎదురుగా వస్తున్న ట్రక్కును తప్పించే ప్రయత్నంలో బస్సు అదుపుతప్పినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ప్రమాదం ధాటికి అక్కడ ఉన్న వారిలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు, మృతులు మరియు క్షతగాత్రుల వివరాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
also read: పహల్గామ్ ఉగ్రదాడి కేసులో హఫీజ్ సయీద్కు NIA సమన్లు.. పాక్ లో ఉన్న సయీద్కు నోటీసులు పంపేందుకు సిద్ధం
