క్రైమ్ మిర్రర్ : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కొండా సుస్మిత వ్యాఖ్యలు హాట్టాపిక్గా మారాయి. రాష్ట్ర మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని లక్ష్యంగా చేసుకుని మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓ టీవీ ఛానల్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. తాను కాంగ్రెస్ పార్టీని విమర్శించడం లేదని, కేవలం సీఎం రేవంత్రెడ్డి వ్యవహారశైలిని మాత్రమే ప్రశ్నిస్తున్నానని సుస్మిత స్పష్టం చేశారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, మీనాక్షి నటరాజన్లపై తనకు పూర్తి గౌరవం ఉందని పేర్కొన్నారు.
‘రేవంత్రెడ్డినే టార్గెట్ చేస్తున్నా’
రాష్ట్రంలో సీఎం రేవంత్రెడ్డి, ఆయన సోదరులు అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని సుస్మిత ఆరోపించారు. ఈ కారణంగానే తాను ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నానని చెప్పారు. తన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా చేసినవిగా చూడొద్దని ఆమె స్పష్టం చేశారు. అయితే సుస్మిత చేసిన ఆరోపణలకు సంబంధించి సంబంధిత వర్గాల నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది.
ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటనపై ప్రశ్నలు
పరకాలలో సీఎం రేవంత్రెడ్డి పర్యటించిన సమయంలో సిట్టింగ్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డికి మరోసారి అవకాశం కల్పిస్తామని ప్రకటించడంపై కూడా సుస్మిత ప్రశ్నలు సంధించారు. ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక, జాబితాల ప్రకటన కాంగ్రెస్ అధిష్టానం, సీడబ్ల్యూసీ పరిధిలో ఉంటాయని ఆమె గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ఒక ఎమ్మెల్యే అభ్యర్థికి మరోసారి అవకాశం ఇస్తామని ముఖ్యమంత్రి ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు.
ఇండిపెండెంట్గా పోటీకి సిద్ధం
వచ్చే ఎన్నికల్లో తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని సుస్మిత మరోసారి స్పష్టం చేశారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎన్నికల బరిలో నిలబడతానని ప్రకటించారు. ఇటీవల కూడా సుస్మిత చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో చర్చకు దారితీసిన నేపథ్యంలో.. తాజా వ్యాఖ్యలు రాజకీయంగా మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఆమె ప్రకటనపై కాంగ్రెస్ వర్గాలు ఎలా స్పందిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.
also read : లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కైన పంచాయతీ కార్యదర్శి..
