క్రైమ్ మిర్రర్ : హిమాచల్ ప్రదేశ్లో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మండి జిల్లాలోని చండీగఢ్–మనాలి జాతీయ రహదారిపై ఉన్న హనోగి టన్నెల్లో రెండు ట్రక్కులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరో ఏడుగురు గాయపడ్డారు. ఉదయం సుమారు 7.45 గంటల సమయంలో వేగంగా వస్తున్న రెండు ట్రక్కులు టన్నెల్లో ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఢీకొన్న తీవ్రతకు రెండు వాహనాల ముందు భాగాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు ఘటనాస్థలంలోనే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెస్క్యూ సిబ్బంది హనోగి టన్నెల్కు చేరుకున్నారు. వాహనాల్లో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం నెర్చౌక్ మెడికల్ కాలేజీకి తరలించారు. ప్రమాదం కారణంగా టన్నెల్లో కొంతసేపు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు ట్రాఫిక్ను క్రమంగా పునరుద్ధరిస్తూ సహాయక చర్యలు కొనసాగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు మండి జిల్లా ఎస్పీ వినోద్ కుమార్ తెలిపారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, వాహనాల వేగం తదితర అంశాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
also read : 1984 సిక్కు అల్లర్ల కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న సజ్జన్ కుమార్ మృతి
