వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షికి న్యాయస్థానంలో స్వల్ప ఊరట లభించింది. ఆయనపై నమోదైన మూడు కేసుల్లో ఒకటైన హత్యాయత్నం కేసులో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే మరో కేసులో బెయిల్ పెండింగ్లో ఉండటంతో ఆయనకు జైలు నుంచి విడుదలయ్యే అవకాశం లేకుండా పోయింది. ప్రస్తుతం ఎమ్మెల్యే కర్నూలు జైలులో రిమాండ్లో ఉన్నారు.
35 మందిపై కేసు.. 28 మందికి బెయిల్
చిప్పగిరిలో వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించి పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ కేసులో మొత్తం 35 మందిని నిందితులుగా చేర్చారు. విచారణ అనంతరం ఎమ్మెల్యే విరూపాక్షితో పాటు మొత్తం 28 మందికి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.
ఘర్షణలో దాడి, కారు ధ్వంసం ఆరోపణలు
ఇటీవల కర్నూలు జిల్లా చిప్పగిరిలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఎమ్మెల్యే విరూపాక్షి, ఆయన అనుచరులు తనపై దాడి చేసి, కారును ధ్వంసం చేశారని టీడీపీ మండల అధ్యక్షుడు పురుషోత్తం ఆరోపించారు. ఇదే ఘటనలో సుచిత్ర అనే దళిత మహిళపై కూడా దాడి జరిగినట్లు ఫిర్యాదులు అందాయి.
అట్రాసిటీ కేసు పెండింగ్
ఘర్షణకు సంబంధించి పోలీసులు ఎమ్మెల్యేపై హత్యాయత్నంతో పాటు ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేశారు. అనంతరం ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరచగా.. న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది.
తాజాగా హత్యాయత్నం కేసులో బెయిల్ లభించినప్పటికీ, అట్రాసిటీ కేసులో ఇంకా బెయిల్ రాకపోవడంతో విరూపాక్షి జైలులోనే కొనసాగాల్సి వస్తోంది. ఈ కేసులో తదుపరి న్యాయపరమైన పరిణామాలపై ఉత్కంఠ నెలకొంది.
also read: సింహగడ్ కోటలో పర్యాటకుల దుస్తులపై అభ్యంతరం చెప్తూ దాడి.. ఎనిమిది మందిపై కేసు
