క్రైమ్ మిర్రర్ : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. రిటైర్మెంట్ ప్రయోజనాలు, ఆస్తికి సంబంధించిన విషయంలో భార్యాభర్తల మధ్య తలెత్తిన వివాదం చివరకు భర్త మృతికి దారితీసింది. హుస్నాబాద్ పట్టణంలోని హనుమాన్ నగర్కు చెందిన వెంకటేశం, రాజమణి దంపతులు. వెంకటేశం ఆసిఫాబాద్లో కమర్షియల్ ట్యాక్స్ విభాగంలో అధికారిగా పనిచేస్తుండగా.. రాజమణి ఏఎన్ఎంగా విధులు నిర్వహిస్తుంది.
వెంకటేశం ఈ నెలలో ఉద్యోగ విరమణ చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రిటైర్మెంట్ అనంతరం వచ్చే డబ్బులు, ఆస్తి విషయంలో దంపతుల మధ్య కొంతకాలంగా విభేదాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఇద్దరి మధ్య మరోసారి గొడవ జరగడంతో వివాదం తీవ్ర రూపం దాల్చింది. ఆ సమయంలో ఆగ్రహానికి గురైన రాజమణి రోకలిబండతో వెంకటేశంపై దాడి చేసింది. దీంతో తీవ్ర గాయాలపాలైన ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని రాజమణిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి ఘటనకు దారి తీసిన పరిస్థితులపై దర్యాప్తు చేస్తున్నారు.
also read : సముద్రంలో ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. కుటుంబాల్లో తీవ్ర ఆందోళన
