తన చిన్ననాటి పాఠశాలకు గానూ నటుడు ధనుష్ చేసిన పని అందరినీ ఆకట్టుకుంటోంది. చెన్నైలోని సాలిగ్రామంలో ఉన్న తాయ్ సత్య మెట్రిక్యులేషన్ స్కూల్కు ఆయన మూడు అంతస్తుల ఆధునిక భవనాన్ని నిర్మించి అందించాడు. ఈ కొత్త భవనానికి ‘ధనుష్ బ్లాక్’ అని పేరు పెట్టడం విశేషం.
ధనుష్ పదో తరగతి వరకు ఇదే పాఠశాలలో చదువుకున్నాడు. తాజాగా జరిగిన భవనం ప్రారంభోత్సవానికి ఆయన తన స్కూల్ మిత్రుడు, సినిమాటోగ్రాఫర్ కుమరన్తో కలిసి హాజరయ్యాడు. 1999 బ్యాచ్కు చెందిన ఈ ఇద్దరూ తమ పాత రోజుల్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు.
కార్యక్రమంలో ధనుష్ తన గురువుల పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవడం ప్రత్యేకంగా నిలిచింది. గురువులతో కలిసి ఫోటోలు దిగుతూ ఆ క్షణాలను మరింత గుర్తుండిపోయేలా చేసుకున్నాడు. ఈ దృశ్యాలు అక్కడున్నవారిని ఎంతో కదిలించాయి.
కుమరన్ మాట్లాడుతూ, ఎల్కేజీ నుంచి పదో తరగతి వరకు తాము ఇదే పాఠశాలలో కలిసి చదివామని తెలిపారు. తర్వాత ఇద్దరూ మరో పాఠశాలలో ఇంటర్ పూర్తి చేశామని, ధనుష్ సినిమా రంగంలోకి వెళ్లగా తాను ఇంజినీరింగ్ చదివి సినిమాటోగ్రఫీ వైపు మళ్లినట్టు చెప్పారు. ‘తంగమగన్’ వంటి చిత్రాల్లో కలిసి పనిచేసిన విషయాన్ని గుర్తు చేశారు.
పాఠశాల పరిస్థితి గురించి తెలుసుకున్న ధనుష్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ భవనం నిర్మించారని కుమరన్ వెల్లడించారు. అంతేకాదు, పాత భవనాల మరమ్మతులతో పాటు అవసరమైన చోట కొత్త నిర్మాణాలు చేపడతానని కూడా హామీ ఇచ్చారని తెలిపారు.
ఇటీవల జరిగిన జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ధనుష్ నటుడిగా ఒక అవార్డు, దర్శకుడిగా మరో అవార్డు అందుకుని మరోసారి తన ప్రతిభను చాటుకున్నారు. ప్రస్తుతం ఆయన ‘ఓం’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో మలయాళ స్టార్ మమ్ముట్టి కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు.
also read: గ్లాస్గోలో 7 మంది అథ్లెట్లు మాయం…
