క్రైమ్ మిర్రర్ : అస్సాం రాష్ట్రం నగావ్ జిల్లాలోని సీఆర్పీఎఫ్ క్యాంపులో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు మృతి చెందగా, మరో జవాన్ గాయపడ్డారు. అనంతరం కాల్పులకు పాల్పడిన ఏఎస్ఐ కూడా మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. అధికారుల సమాచారం ప్రకారం, మంగళవారం ఉదయం 34వ బెటాలియన్ క్యాంపు కార్యాలయం వద్ద ఏఎస్ఐ బల్లాని ప్రేమబరం విధుల్లో ఉన్నారు. ఈ సమయంలో గార్డు రూమ్లోని ఇన్సాస్ రైఫిల్ తీసుకున్న ఆయన క్యాంపు ప్రాంగణంలో కాల్పులు జరిపినట్లు తెలిపారు.
ఈ ఘటనలో విష్ణు ప్రసాద్ బఘేల్, రామ్నవల్ సింగ్ యాదవ్ అనే ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో జవాన్ మనే గోవింద్ శ్రీపుల్ గాయపడగా, ఆయనను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. కాల్పుల అనంతరం ఏఎస్ఐ ప్రేమబరం తన వద్ద ఉన్న ఆయుధంతో కాల్చుకుని మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఘటన సమాచారం అందుకున్న సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు, పోలీసులు క్యాంపుకు చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఈ ఘటనకు దారితీసిన కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది. వ్యక్తిగత కారణాలా లేదా ఇతర అంశాల ప్రభావమా అనే కోణాల్లో అధికారులు విచారణ చేపట్టారు.
also read : జమ్మూకశ్మీర్లో ప్రకృతి విలయం.. క్లౌడ్ బరస్ట్లతో భారీ నష్టం, 31 మంది మృతి..
