ప్రేమ పేరుతో ఓ ఇంజినీరింగ్ విద్యార్థినిని వేధింపులకు గురిచేసిన యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. చేబ్రోలు పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసుల వివరాల ప్రకారం.. ఓ యువకుడు సదరు విద్యార్థినిని ప్రేమిస్తున్నానంటూ కొంతకాలంగా వెంటపడుతున్నాడు. అయితే యువతి అతడి ప్రేమను అంగీకరించకపోవడంతో ఆమెను బెదిరింపులకు గురిచేశాడు. ప్రేమకు ఒప్పుకోకపోతే యాసిడ్ దాడి చేస్తానని, ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తానని బెదిరించినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.
ఈ క్రమంలో ముందుగా మాట్లాడాలని చెప్పి యువతిని ఓ ఆలయానికి పిలిచాడు. అక్కడ తన స్నేహితుడి సహాయంతో ఆమె మెడలో తాళి కట్టి ఫొటోలు తీయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం ఆ తాళిని తిరిగి తీసుకుని వెళ్లిపోయినట్లు బాధితురాలు తెలిపింది.
ఘటనపై కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువకుడి బెదిరింపులు, ఇతర ఆరోపణలపై ఆధారాలను సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
also read: కూతురిపై కన్నేశాడని… ప్రైవేట్ పార్ట్ కోసేసింది…
