జమ్ముకశ్మీర్లో మరోసారి ఉగ్రవాదుల దాడి కలకలం రేపింది. కుల్గామ్ జిల్లాలో జరిగిన కాల్పుల ఘటనలో ఛత్తీస్గఢ్కు చెందిన ఇద్దరు వలస కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మృతులను దీపక్ రాత్రే (24), భూపేంద్ర భైనా (28)గా గుర్తించారు.
కుటుంబాలను పోషించేందుకు కశ్మీర్లోని ఓ ఇటుక బట్టీలో పనిచేస్తున్న వీరిపై ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లు సమాచారం. ఈ ఘటనలో ఇద్దరూ తీవ్రంగా గాయపడి మృతి చెందారు. దీంతో వారి స్వగ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఈ దాడిని ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి తీవ్రంగా ఖండించారు. అమాయక కార్మికులపై దాడి చేయడం అత్యంత దారుణమైన, పిరికిపంద చర్య అని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు.
మృతదేహాలను స్వగ్రామాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారని సీఎం వెల్లడించారు. ఈ ఘటనపై భద్రతా బలగాలు దర్యాప్తు చేపట్టాయి. ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
also read: కదులుతున్న లోకల్ ట్రైన్ కిందకు దూకబోయిన వ్యక్తి… కాపాడిన మహిళా కానిస్టేబుల్
