క్రైం మిర్రర్ : బిహార్ బంద్ సందర్భంగా శివాన్ జిల్లాలో చోటుచేసుకున్న కాల్పుల ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నిరసనలో పాల్గొన్న వారిపై ఓ పోలీసు కానిస్టేబుల్ ఏకే-47 రైఫిల్తో కాల్పులు జరిపినట్లు ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు అతడిని సస్పెండ్ చేశారు. ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో అధికారులు విచారణకు ఆదేశించారు.
ఈ నెల 25న విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన బిహార్ బంద్ సందర్భంగా పలు ప్రాంతాల్లో నిరసనకారులు, పోలీసుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు గాయపడినట్లు అధికారులు తెలిపారు. వారిని చికిత్స నిమిత్తం పాట్నాలోని ఆస్పత్రికి తరలించగా, వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది.గాయపడిన వారిలో 15 ఏళ్ల మహమ్మద్ ఆరిఫ్ కూడా ఉన్నాడు. బంద్ కారణంగా దుకాణం మూసివేసి ఇంటికి వెళ్తున్న సమయంలో గాయపడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. శస్త్రచికిత్స అనంతరం అతని ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.
ఈ ఘటనపై ప్రతిపక్ష నాయకులు తీవ్రంగా స్పందించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ డిమాండ్ చేశారు. కాల్పులకు సంబంధించిన వీడియోను ఆయన సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా స్పందిస్తూ, నిరసనకారులపై బలప్రయోగాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్ష నేతలు కోరుతున్నారు.
also read :సీఎం చంద్రబాబుతో కలిసి భోజనం చేసిన విద్యార్థిని మృతి..
