మానవులు, జంతువుల మధ్య ఏర్పడే అనుబంధం ఎంత గొప్పదో తెలియజేసే విషాద ఘటన మధ్యప్రదేశ్లో చోటుచేసుకుంది. 15 ఏళ్లుగా తన యజమానితో విడదీయరాని బంధాన్ని కొనసాగించిన ఓ పెంపుడు శునకం.. ఆయన మరణాన్ని తట్టుకోలేక చివరకు ఆయన అంతిమయాత్రలోనే ప్రాణాలు విడిచింది. ఈ ఘటన స్థానికులను భావోద్వేగానికి గురిచేసింది.
మధ్యప్రదేశ్లోని బేతుల్ జిల్లాకు చెందిన ప్రదీప్ జైన్ (67) అనారోగ్యంతో బాధపడుతూ భోపాల్లోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మృతదేహాన్ని కుటుంబ సభ్యులు స్వగ్రామానికి తీసుకురాగా, 15 ఏళ్లుగా ఆయనతో కలిసి ఉన్న ‘డగ్గూ’ అనే పోమరేనియన్ జాతి శునకం తీవ్రంగా కలత చెందింది.
also read: హైదరాబాద్ చరిత్రలో ఓ అధ్యాయం ముగింపు.. కూలుతున్న తాజ్ బంజారా, రానున్న భారీ ప్రాజెక్ట్
కుటుంబ సభ్యుల ప్రకారం.. యజమాని మృతదేహాన్ని చూసినప్పటి నుంచి డగ్గూ ఆహారం తీసుకోకుండా, నిద్రపోకుండా బాధపడింది. తన యజమాని ఇక తిరిగి రారని అర్థం చేసుకున్నట్టుగా మౌనంగా ఆయన వద్దే ఉండిపోయింది.
ప్రదీప్ జైన్ అంతిమయాత్ర ప్రారంభమైన సమయంలో డగ్గూను కూడా ఆయన పక్కకు తీసుకెళ్లారు. కొద్దిసేపు మృతదేహం వద్ద కూర్చున్న ఆ శునకం, అనంతరం పాడె వెంట కొంత దూరం నడిచింది. అయితే కొద్ది సమయంలోనే ఒక్కసారిగా కుప్పకూలిపోయి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.
ప్రదీప్ జైన్ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. డగ్గూకు ఆయనంటే ఎంతో ప్రేమ ఉండేదని తెలిపారు. రోజూ ఆయన ఇంటికి వచ్చే సమయం కోసం ఎదురుచూసేదని, ఆయన ఆరోగ్యం బాగోలేని సమయంలో తాను కూడా తినకుండా ఉండేదని చెప్పారు. ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం కుటుంబ సభ్యులను కూడా ఆశ్చర్యానికి గురిచేసేదని తెలిపారు.
తర్వాత కుటుంబ సభ్యులు ప్రదీప్ జైన్ అంత్యక్రియలు జరిగిన ప్రదేశానికి సమీపంలోనే డగ్గూకు కూడా అంత్యక్రియలు నిర్వహించారు. జీవించినంత కాలం తోడుగా ఉన్న యజమాని కోసం చివరి ప్రయాణంలోనూ వెంట నడిచిన ఈ శునకం కథ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
జంతువులకు ఉండే ప్రేమ, విశ్వాసానికి ఈ ఘటన ఓ ఉదాహరణగా నిలుస్తోందని పలువురు నెటిజన్లు భావోద్వేగ వ్యాఖ్యలు చేస్తున్నారు.
also read: హత్య కేసులో తప్పించుకున్న రౌడీషీటర్ అరెస్ట్.. పీర్ బాబా వేషంలో దాగిన నిందితుడు పట్టివేత