దేశవ్యాప్తంగా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) బుధవారం భారీ స్థాయిలో సోదాలు నిర్వహించింది. ఐసీస్ (ISIS), అల్ ఖైదా ఇన్ ది ఇండియన్ సబ్కాంటినెంట్ (AQIS) వంటి ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన ప్రచారం, కార్యకలాపాలపై దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టారు. హింసాత్మక జిహాద్ ద్వారా భారత్లో ఇస్లామిక్ స్టేట్ ఏర్పాటు చేయాలనే కుట్రపై ఎన్ఐఏ ప్రత్యేకంగా దృష్టి సారించింది.
ఈ సోదాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు మొత్తం 10 రాష్ట్రాలు మరియు ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతంలోని 20 ప్రాంతాల్లో ఒకేసారి జరిగాయి. వివిధ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించిన అధికారులు కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు, హార్డ్డిస్కులు వంటి పలు డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిని మరింత లోతుగా పరిశీలించేందుకు ఫోరెన్సిక్ పరీక్షలకు పంపనున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ కేసులో ఇప్పటివరకు 11 మంది నిందితులతో పాటు ఒక బాలుడిని కూడా జువెనైల్ చట్టాల ప్రకారం అదుపులోకి తీసుకున్నట్లు ఎన్ఐఏ వెల్లడించింది. విజయవాడ పోలీసులు ఈ ఏడాది మార్చిలో నమోదు చేసిన కేసును మే నెలలో ఎన్ఐఏకు బదిలీ చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఈ కేసుపై కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణ కొనసాగిస్తోంది. ప్రధాన నిందితుడిగా ఉన్న రెహ్మతుల్లా షరీఫ్ మహ్మద్ ఇంట్లో గతంలో నిర్వహించిన సోదాల్లో ఐసీస్, ఏక్యూఐఎస్కు సంబంధించిన ప్రచార సామగ్రి లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. అలాగే అప్పట్లో స్వాధీనం చేసుకున్న డిజిటల్ పరికరాలను సాంకేతికంగా విశ్లేషించిన తర్వాత లభించిన సమాచారం ఆధారంగానే తాజా సోదాలు నిర్వహించినట్లు వెల్లడించారు.
దర్యాప్తులో భాగంగా అరెస్టైన నిందితులు దేశంలోని యువతను జిహాదీ భావజాలం వైపు ఆకర్షించేందుకు ప్రయత్నించినట్లు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. విదేశాల్లో ఉన్న వ్యక్తులతో ఆన్లైన్ ద్వారా సంప్రదింపులు కొనసాగిస్తూ ఉగ్ర భావజాలాన్ని వ్యాప్తి చేసినట్లు కూడా విచారణలో తేలిందని చెప్పారు. దేశంలో అస్థిర పరిస్థితులు సృష్టించి ‘ఖలీఫత్’ ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో భాగంగా పనిచేసిన వారిని గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతోందని ఎన్ఐఏ అధికారులు వెల్లడించారు.