పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ట్రాన్స్ఫార్మర్లో ఫీజు సరిచేసే క్రమంలో విద్యుత్ షాక్కు గురై ఓ కౌలు రైతు ప్రాణాలు కోల్పోయాడు. స్థానికుల వివరాల ప్రకారం.. ముత్తారం మండల కేంద్రానికి చెందిన వెంకట్రెడ్డి పారుపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని శాలగుండ్లపల్లి శివారులో కొంత భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు.
మంగళవారం తన పొలంలోని మోటారుకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో కారణం తెలుసుకునేందుకు సమీపంలోని ట్రాన్స్ఫార్మర్ వద్దకు వెళ్లాడు. అక్కడ ఫీజు కాలిపోయినట్లు గుర్తించి.. సరఫరా నిలిపివేసి మరమ్మతు చేసేందుకు ట్రాన్స్ఫార్మర్పైకి ఎక్కాడు. అయితే అనుకోకుండా విద్యుత్ సరఫరా కావడంతో వెంకట్రెడ్డి తీవ్ర షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు, స్థానికులు ఘటనాస్థలికి చేరుకున్నారు.
పోలీసులు వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మంథని ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నట్లు సమాచారం. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
also read: ప్రధాని మోదీకి ఇండోనేషియా అత్యున్నత గౌరవం.. బింటాంగ్ ఆదిపూర్ణ అవార్డుతో సత్కారం