Homeక్రైమ్గోల్డ్ మ్యాన్ గేమ్ ఓవర్… రూ.30 లక్షల మోసం చేసి పారిపోతుండగా షాద్‌నగర్‌లో అరెస్ట్!

గోల్డ్ మ్యాన్ గేమ్ ఓవర్… రూ.30 లక్షల మోసం చేసి పారిపోతుండగా షాద్‌నగర్‌లో అరెస్ట్!

హైదరాబాద్‌లో తక్కువ ధరకు బంగారం పేరుతో పెద్ద మోసం వెలుగులోకి వచ్చింది. సూర్య భాయ్ అనే వ్యక్తి “విదేశీ గోల్డ్ తక్కువ రేటుకే అందిస్తా” అంటూ అమాయకులను నమ్మబలికి లక్షల రూపాయలు వసూలు చేశాడు. గోల్డ్ మ్యాన్‌గా పరిచయం పెంచుకున్న అతను చివరకు తన అసలు రంగు బయటపడటంతో పరారయ్యేందుకు ప్రయత్నించాడు. అయితే పోలీసులు షాద్‌నగర్ వద్ద అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.

ఈ మోసంలో ప్రధానంగా హిమాయత్‌నగర్, నీలోఫర్ ప్రాంతాలకు చెందిన పలువురు టార్గెట్ అయ్యారు. సూర్య భాయ్ మాటలు నమ్మిన బాధితులు దాదాపు రూ.30 లక్షలు ఇచ్చినా, వారికి బంగారం మాత్రం అందలేదు. డబ్బులు తిరిగి ఇవ్వాలని బాధితులు ఒత్తిడి చేయడంతో, సూర్య భాయ్ మరో డ్రామాకు తెరతీశాడు. తన వద్ద ఉన్న మూడు ఐఫోన్లు ఇచ్చి వాటి విలువ రూ.10 లక్షలు అని చెప్పి, అదనంగా రూ.20 లక్షల చెక్ ఇచ్చి వారిని పంపించాడు.

ఇక్కడితో కథ ముగియలేదు. బాధితులే తనను బెదిరించి ఫోన్లు తీసుకెళ్లారని సూర్య భాయ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం కేసును మరింత మలుపుతిప్పింది. అయితే పోలీసులు లోతుగా దర్యాప్తు చేయడంతో అసలు నిజం బయటపడింది. తక్కువ ధర బంగారం పేరుతో పెద్ద మోసం జరిగినట్లు నిర్ధారించారు.

ఈ కేసును మొదట అత్తాపూర్ పోలీసులు నమోదు చేసి, తర్వాత నారాయణగూడ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. అరెస్ట్ భయంతో హైదరాబాద్ నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించిన సూర్య భాయ్‌ను పోలీసులు షాద్‌నగర్‌లో పట్టుకున్నారు. ప్రస్తుతం అతనిపై పూర్తి స్థాయి విచారణ కొనసాగుతోంది.

also read: “ఫుట్‌పాత్‌పై వాయిలిన్‌తో పోరాటం… 80 ఏళ్ల కళాకారుడి జీవితాన్ని మార్చబోతున్న ఆనంద్ మహీంద్ర!”

తాజావార్తలు