క్రైమ్ మిర్రర్, పాలిటిక్స్:- పశ్చిమ బెంగాల్లో ఓటమి తరువాత మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి షాక్ మీద షాక్ తగులుతోంది. తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందిన విషయం తెలిసిందే. ఇక్కడ బీజేపీ తొలిసారి అధికారాన్ని దక్కించుకుంది. బీజేపీ నేత సువేందు అదికారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత నుంచి ఇక్కడ తృణమూల్ నేతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ పార్టీకి చెందిన ముఖ్య నేతలపై అనేక చోట్ల దాడులు జరుగుతున్నాయి. ఒకవైపు పార్టీ నాయకులపై జరుగుతున్న దాడులను దేశ వ్యాప్తంగా ప్రజలు దృష్టికి తీసుకవచ్చే ప్రయత్నం చేస్తున్న మమతా బెనర్జీకి మరో షాక్ తగిలింది. టీఎంసీకి చెందిన రెబల్ ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీకి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇస్తూ స్పీకర్ రతీంద్ర బోస్ ఆదేశాలను జారీ చేశారు. ఈ వ్యవహారం ఇప్పుడు పశ్చిమ బెంగాల్ పొలిటికల్ సర్కిల్స్లో చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతకు కేటాయించిన చాంబర్ తాళాలను కూడా స్పీకర్ కార్యాలయ అధికారులు అందించడం గమనార్హం.
మమతా బెనర్జీ నిర్ణయానికి వ్యతిరేకంగా..
అసెంబ్లీలో టీఎంసీ నేతగా శోభన్ దేబ్ చటోపాధ్యాయ్ను ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ ఎంపిక చేశారు. అయితే, ఈ నిర్ణయాన్ని ఆ పార్టీకి చెందిన మెజార్టీ ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తూ వచ్చారు. అయినప్పటికీ మమతా బెనర్జీ వెనక్కి తగ్గలేదు. శోభన్దేబ్ చటోపాధ్యాయ్కు ప్రతిపక్ష నేతగా అవకాశం కల్పించాలని ఆమె కోరుతూ వస్తున్నారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించిన టీఎంసీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. టీఎంసీకి చెందిన 80 మంది ఎమ్మెల్యేల్లో 59 మంది ఎమ్మెల్యేలు తిరుగుబావుటా ఎగురవేశారు. ఆ తరువాత రితబ్రత సారథ్యంలో రెబల్ ఎమ్మెల్యేలు స్పీకర్ను కలిసి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని కోరుతూ లేఖ ఇచ్చారు. తామే టీఎంసీ అని, రితబ్రతకే ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని కోరారు. ఈ నేపథ్యంలోతాజాగా స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రితబ్రతను టీఎంసీ ఫ్లోర్ లీడర్గా, ప్రతిపక్ష నేతగా గుర్తిస్తూ స్పీకర్ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఈ వ్యవహారంపై టీఎంసీ చీఫ్ మమతా ఎలా స్పందిస్తారో చూడాలి. ఇదిలా ఉంటే ప్రతిపక్ష నేతగా ఎన్నికైన రితబ్రత కూడా పార్టీ అధినేత్రి మమత పట్ల విధేయతను చాటుకున్నారు. తనకు పార్టీని చీల్చే ఉద్ధేశం లేదన్న ఆయన.. తమ నాయకురాలు మమతా బెనర్జీయేనని స్పష్టం చేశారు.