విశాఖపట్నంలో సోషల్ మీడియా పరిచయం పేరుతో అమలు చేసిన పక్కా వ్యూహం ఓ యువకుడి ప్రాణాల మీదకు తెచ్చిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన యువతి మాటలు నమ్మి విశాఖకు వచ్చిన ఓ యువకుడిని కిడ్నాప్ చేసి, నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి దారుణంగా దాడి చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన వెనుక వ్యక్తిగత కక్షలు, ప్రేమ వ్యవహారానికి సంబంధించిన విభేదాలే ప్రధాన కారణంగా పోలీసులు భావిస్తున్నారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా జామి మండలం అలమండ గ్రామానికి చెందిన యోగేంద్ర భాస్కర్ బాలాజీ అనే యువకుడికి కొంతకాలం క్రితం ఇన్స్టాగ్రామ్ ద్వారా ఓ యువతి పరిచయమైంది. అయితే అదే యువతితో ఇప్పటికే ప్రణీత్ అనే యువకుడికి కూడా సన్నిహిత పరిచయం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న ప్రణీత్, భాస్కర్ బాలాజీపై ఆగ్రహం పెంచుకుని ఆ యువతికి దూరంగా ఉండాలని, ఆమె వెంట తిరగవద్దని హెచ్చరించినట్లు సమాచారం. అప్పటి నుంచి ఇద్దరి మధ్య విభేదాలు కొనసాగుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఈ వివాదం కొనసాగుతుండగానే మరో యువతి ఇన్స్టాగ్రామ్ ద్వారా భాస్కర్ బాలాజీకి పరిచయమైంది. ఈ విషయాన్ని తెలుసుకున్న ప్రణీత్, తన కక్ష తీర్చుకోవడానికి ఆ యువతిని ఉపయోగించుకోవాలని ప్రణాళిక రచించినట్లు విచారణలో వెల్లడైంది. పథకం ప్రకారం ఆ యువతి భాస్కర్ బాలాజీని విశాఖపట్నానికి రావాలని కోరింది. ఆమె మాటలను నమ్మిన బాలాజీ మే 28న విశాఖకు చేరుకుని మద్దిలపాలెం ప్రాంతానికి వచ్చాడు. అక్కడ యువతిని కలిసిన అనంతరం ఇద్దరూ కలిసి మద్దిలపాలెం నుంచి ఆర్కే బీచ్ వైపు ఆటోలో బయలుదేరినట్లు సమాచారం.
అయితే అప్పటికే ప్రణీత్ తన సహచరులతో కలిసి పూర్తి ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. పలువురు యువకులు బైక్లపై ఆటోను వెంబడిస్తూ సరైన సమయం కోసం వేచి చూశారు. ఆటో ఇసుకతోట ప్రాంతానికి చేరుకోగానే దాన్ని అడ్డగించి యువతిని మధ్యలోనే దింపేశారు. అనంతరం భాస్కర్ బాలాజీని ఆటోలో నుంచి బయటకు రానివ్వకుండా నిర్బంధించి బలవంతంగా తీసుకెళ్లినట్లు పోలీసులు వెల్లడించారు. అక్కడి నుంచి హనుమంతవాక, ఆరిలోవ, అడవివరం మార్గంగా భైరవకోన సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తరలించారు.
ఆ ప్రాంతంలో ప్రణీత్ అలియాస్ సున్యోతో పాటు పండు, టైసన్ మరియు మరో ఇద్దరు కలిసి భాస్కర్ బాలాజీపై విచక్షణారహితంగా దాడి చేసినట్లు కేసు నమోదైంది. కత్తులు, ఇతర మారణాయుధాలతో దాడి చేయడంతో బాధితుడు తీవ్ర గాయాలకు గురయ్యాడు. ప్రాణభయంతో అక్కడి నుంచి బయటపడిన బాధితుడు అనంతరం త్రీటౌన్ పోలీసులను ఆశ్రయించి జరిగిన విషయాన్ని వివరించాడు. బాధితుడి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు హత్యాయత్నం, కిడ్నాప్, అలాగే ఎస్.టి.అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేశారు.
ఘటనపై వేగంగా స్పందించిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ కేసులో ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన యువతుల పాత్ర ఏమిటి, వారు ముందస్తు ప్రణాళికలో భాగస్వాములా లేదా అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సోషల్ మీడియా పరిచయాలను పూర్తిగా నమ్మి అపరిచితులను కలవడం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన మరోసారి స్పష్టం చేస్తోందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా యువత సోషల్ మీడియాలో ఏర్పడే పరిచయాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
ALSO READ: Papaya in Breakfast: ఉదయాన్నే ఈ ఒక్క పండు తింటే అందం, ఆరోగ్యం మీ సొంతం…!