హైదరాబాద్, క్రైమ్మిర్రర్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్లో తెరకెక్కుతున్న పెద్ది సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ మూవీ జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుండగా.. అంతకంటే ముందే జూన్ 3 రాత్రి నుంచి స్పెషల్ ప్రీమియర్ షోలు ప్రారంభం కానున్నాయి. దీంతో అభిమానుల్లో సందడి మొదలైంది.
ఏపీలో ఈ సినిమాకు సంబంధించిన బుకింగ్స్ ఇప్పటికే ఓపెన్ అయ్యాయి. పలు నగరాల్లో థియేటర్ల వద్ద టికెట్లు వేగంగా బుక్ అవుతున్నాయి. కొన్ని చోట్ల జూన్ 5 ఉదయం షో టికెట్లు కూడా ముందుగానే అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా స్పెషల్ ప్రీమియర్ షోలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో టికెట్ ధర రూ.600కు చేరింది. జీఎస్టీతో కలిపి ఈ ధరను నిర్ణయించగా.. అభిమానులు భారీగానే స్పందిస్తున్నారు.
జూన్ 4 నుంచి పది రోజుల పాటు సాధారణ టికెట్ ధరలపై సింగిల్ స్క్రీన్స్లో రూ.100, మల్టీప్లెక్స్లలో రూ.125 వరకు పెంచుకునేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే రోజుకు ఐదు షోలు ప్రదర్శించుకోవచ్చని అనుమతి రావడంతో థియేటర్ యజమానులు కూడా రెడీ అవుతున్నారు.
అయితే తెలంగాణలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. టికెట్ రేట్ల పెంపుపై హైకోర్టు నిబంధనల కారణంగా చిత్ర యూనిట్ వేచి చూస్తోంది. ప్రభుత్వం నుంచి అనుమతి వస్తే ప్రత్యేక ధరలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. లేదంటే సాధారణ ధరలతోనే విడుదల చేయాల్సి రావచ్చు.
మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఉత్తరాంధ్ర తీర ప్రాంతం నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. కన్నడ స్టార్ శివరాజ్కుమార్ కీలక పాత్ర పోషిస్తుండటంతో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. రామ్ చరణ్ మాస్ లుక్ను పెద్ద తెరపై చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.