క్రైమ్ మిర్రర్, వైరల్ :- మన వంటింట్లో తరచూ కనిపించే మసాలా దినుసుల్లో గసగసాలు కూడా ఒకటి. ముఖ్యంగా నాన్వెజ్ కర్రీలు, గ్రేవీలకు ప్రత్యేక రుచి, సువాసన ఇవ్వడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే.. ఈ గసగసాలు వచ్చే మొక్క నుంచే ఓపియం అనే మత్తు పదార్థం కూడా తయారవుతుంది.
గసగసాలు ఓపియం పాపీ అనే మొక్క నుంచి వస్తాయి. ఈ మొక్కల నుంచి వచ్చే పాలలాంటి పదార్థాన్ని ప్రాసెస్ చేస్తే ఓపియం తయారవుతుంది. చరిత్ర ప్రకారం.. ఈ ఓపియం కోసం గతంలో దేశాల మధ్య యుద్ధాలు కూడా జరిగాయి. వాటినే ఓపియం వార్స్ గా పిలుస్తారు.
మొఘల్ కాలంలో ఓపియం విలువైన వ్యాపారంగా ఉండేది. తర్వాత బ్రిటిష్ కాలంలో దీని డిమాండ్ మరింత పెరిగింది. స్వాతంత్ర్యం తర్వాత భారతదేశంలో ఓపియం వినియోగంపై కఠిన నియంత్రణలు వచ్చాయి. ప్రస్తుతం ప్రభుత్వ అనుమతితో కొన్ని రాష్ట్రాల్లో ఔషధ అవసరాల కోసం మాత్రమే దీనిని సాగు చేస్తున్నారు.అయితే అదే మొక్క నుంచి వచ్చే గసగసాలను మాత్రం వంటల్లో విస్తృతంగా వాడుతున్నారు. కూరల్లో చిక్కదనం, మంచి రుచి ఇవ్వడమే కాకుండా జీర్ణశక్తి మెరుగుపడటానికి, మంచి నిద్రకు, ఎముకల బలానికి కూడా ఇవి ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు.ఇప్పుడు ఈ గసగసాల టాపిక్ మళ్లీ హాట్ టాపిక్ కావడానికి కారణం ఎన్టీఆర్ డ్రాగన్ మూవీ. ఆయన పుట్టినరోజు సందర్భంగా విడుదలైన టీజర్లో కనిపించిన కొన్ని విజువల్స్ చూసి.. ఈ సినిమా కథ ఓపియం పాపీ సాగు, దాని చుట్టూ జరిగే ఘర్షణలపై ఉండొచ్చన్న చర్చ సోషల్ మీడియాలో మొదలైంది.యాక్షన్తో పాటు బ్లడ్బాత్ కనిపించిన టీజర్లో గసగసాల తోటలను పోలిన సన్నివేశాలు ఉండటంతో.. ప్రశాంత్ నీల్ ఈసారి కొత్త బ్యాక్డ్రాప్ను ఎంచుకున్నారా? అన్న ఆసక్తి అభిమానుల్లో పెరిగింది.అయితే డ్రాగన్ కథ నిజంగానే గసగసాలు, ఓపియం చుట్టూనే తిరుగుతుందా.. లేక అది టీజర్లోని చిన్న హింట్ మాత్రమేనా అన్నది తెలుసుకోవాలంటే సినిమా రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే. ప్రస్తుతం మాత్రం గసగసాల వెనకున్న చరిత్రతో పాటు డ్రాగన్ టీజర్ కలిపి సోషల్ మీడియాలో మంచి చర్చకు దారి తీస్తున్నాయి.