చెన్నై, క్రైమ్ మిర్రర్:తమిళనాడు రాజకీయాల్లో దళపతి విజయ్ శకం మొదలైనప్పటి నుండి సెక్రటేరియట్ వాతావరణం పూర్తిగా మారిపోయింది. సినీ రంగంలో తన క్రమశిక్షణతో అందరినీ ఆశ్చర్యపరిచే విజయ్, ఇప్పుడు అదే షూటింగ్ స్పాట్ డిసిప్లిన్ ను పరిపాలనలోనూ అమలు చేస్తున్నారు.ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్, తన పనితీరుతో ఐఏఎస్ అధికారులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. సాధారణంగా సినిమా షూటింగ్ల సమయంలో ఉదయాన్నే సెట్కు చేరుకునే అలవాటున్న విజయ్, ఇప్పుడు అదే పద్ధతిని కోటగా పిలిచే సెక్రటేరియట్లోనూ పాటిస్తున్నారు. ఉదయం సరిగ్గా 9:00 గంటలకు ఆయన తన కార్యాలయంలో ప్రత్యక్షమవుతున్నారు. ఆయన రావడమే కాదు, తన టీమ్ , సంబంధిత శాఖల అధికారులు కూడా సమయపాలన పాటించేలా కఠిన ఆదేశాలు జారీ చేశారు.
ముఖ్యమంత్రి కార్యాలయంలో ఆలస్యానికి తావులేదన్న సంకేతం బలంగా వెళ్ళింది.విజయ్ పరిపాలనలో పెండింగ్ అనే పదానికి చోటు లేకుండా చూస్తున్నారు. సినిమా స్క్రిప్ట్ను ఎలాగైతే క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకుంటారో, అదే విధంగా ప్రతి ఫైలును లోతుగా అధ్యయనం చేస్తున్నారు. ఏదైనా పథకం లేదా నిర్ణయం వల్ల సామాన్యుడికి కలిగే లాభం ఏమిటనేది ఆయన మొదటి ప్రశ్నగా ఉంటోంది. ఒకసారి విషయం అర్థమయ్యాక, నిర్ణయం తీసుకోవడంలో ఏమాత్రం ఆలస్యం చేయడం లేదు. గతంలో వారాల తరబడి నలిగే ఫైళ్లు ఇప్పుడు 24 నుంచి 48 గంటల్లోపే క్లియర్ అవుతుండటం సెక్రటేరియట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
విజయ్ అధికారులతో వ్యవహరించే తీరు చాలా ప్రశాంతంగా, అదే సమయంలో చాలా సీరియస్గా ఉంటోంది. అనవసరమైన హంగులు, ఆర్భాటాలకు తావులేకుండా టు ద పాయింట్ మాట్లాడటం ఆయన శైలి. క్షేత్రస్థాయిలో సమస్యలపై అధికారుల నుంచి కేవలం రిపోర్టులు తీసుకోవడమే కాకుండా, తానే స్వయంగా వీడియో కాన్ఫరెన్స్ల ద్వారా కలెక్టర్లతో మాట్లాడుతున్నారు. అధికారులకు స్వేచ్ఛను ఇస్తూనే, జవాబుదారీతనాన్ని డిమాండ్ చేస్తున్నారు. పని చేసే వారికి గుర్తింపు ఉంటుందని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన ముందే స్పష్టం చేశారు. పాలనలో అనుభవం లేదన్న విమర్శలను తిప్పికొట్టేలా, విజయ్ తన చుట్టూ అనుభవజ్ఞులైన మాజీ ఐఏఎస్ అధికారులు, నిపుణులతో కూడిన ఒక కోర్ టీమ్ ను ఏర్పాటు చేసుకున్నారు.
వీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ను తీసుకుంటూనే, ప్రతి శనివారం ప్రజల నుంచి నేరుగా అర్జీలు తీసుకునేలా ఒక వ్యవస్థను రూపొందించారు.సినిమాల్లో మాదిరిగా అద్భుతాలు చేయాలని కాకుండా, వాస్తవానికి దగ్గరగా ఉంటూ పారదర్శకమైన పాలన అందించాలనేది ఆయన తాపత్రయం.ఒక సినిమాను నిర్ణీత సమయంలో పూర్తి చేయడానికి విజయ్ ఎలాగైతే కష్టపడతారో, ఇప్పుడు తన మేనిఫెస్టో లోని హామీలను కూడా ఒక షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయాలని టార్గెట్లు పెట్టుకున్నారు. మనం ప్రజలకు జవాబుదారీ, సమయం వృధా చేసే హక్కు మనకు లేదు అని ఆయన తరచూ తన కేబినెట్ సహచరులకు గుర్తు చేస్తున్నారు. ఈ క్రమశిక్షణే ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వ యంత్రాంగంలో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. విపక్షాల విమర్శలకు తన పనితీరుతోనే సమాధానం చెప్పాలనేది దళపతి ప్లాన్.