-
ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం…
కుకునూరు, క్రైమ్మిర్రర్: ఇద్దరు ప్రేమించుకున్నరు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నరు. నూరెళ్ల జీవితాన్ని గడపాలని ఆశపడ్డరు. కాని ఆ బంధం నెల రోజుల తిరగకముందే చిన్నబిన్నామైంది. సెల్ఫోన్ వివాదం ఇద్దరి మధ్య చిచ్చురేపి చివరికి బలవన్మరణానికి పాల్పడేలా పురికొల్పింది. ఈ విషాద ఘటన కుకునూరు మండలంలో చోటు చేసుకుంది. రాయరం గ్రామానికి చెందిన వినయ్ (23), కొండపాకకు చెందిన అంజలి (21) గత కొంతకాలంగా ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి సరిగ్గా నెల రోజుల క్రితమే వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. నవదంపతులు ఎంతో సంతోషంగా గడుపుతారని భావించిన కుటుంబ సభ్యులకు పిడుగులాంటి వార్త విన్నారు.
పోలీసులు వివరాల ప్రకారం.. అంజలి వేరొకరితో ఫోన్లో మాట్లాడుతోందన్న అనుమానం వినయ్లో పెరిగిపోయింది. ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. ఈ గొడవ ముదిరి ఒకరిపై ఒకరు కోపం పెంచుకున్నారు. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన అంజలి.. కొండపాకలోని తన పుట్టింటికి వెళ్లిపోయింది. అక్కడ ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తాన ప్రాణంగా ప్రేమించిన భార్య ఇక లేదన్న వార్త వినయ్ను కుదిపేసింది. ఆమె మరణాన్ని తట్టుకోలేక.. తీవ్ర వేదనతో వినయ్ కూడా బలవన్మరణానికి సిద్ధపడ్డాడు. రాయరం మల్లన్నసాగర్ కట్ట పక్కన ఉన్న నిర్మానుష్య ప్రాంతంలో ఉరివేసుకుని ప్రాణాలు వదిలాడు.
పెళ్లయిన నెల రోజులకే దంపతులిద్దరూ ఇలా విగతజీవులుగా మారడంతో ఇరు కుటుంబాల సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం రెండు నిండు ప్రాణాలను బలితీసుకోవడమే కాకుండా, రెండు కుటుంబాల్లో తీరని విషాాదాన్ని నింపింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న కుకునూర్ పల్లి పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.