By-Election Results 2026: దేశంలోని నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతంలో జరిగినన ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. బెంగాల్, అస్సోం, పుదుచ్చేరిలో బీజేపీ జయకేతనం ఎగురవేయగా, కేరళలో కాంగ్రెస్ కూటమి, తమిళనాడులో హంగ్ ఏర్పడింది. ఇదే సమయంలో కొన్ని ఖాళీ అయిన స్థానాలకు నిర్వహించిన ఉప ఎన్నికల ఫలితాలు కూడా వెల్లడయ్యాయి. మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఈ ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నాలుగు స్థానాల్లో విజయం సాధించగా, ఓ చోట ఎన్సీపీ, మరో రెండు చోట్ల కాంగ్రెస్ గెలిచింది.
బారామతిలో అజిత్ పవార్ భార్య విజయం
మహారాష్ట్రలో జరిగిన విమాన ప్రమాదంలో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణించడంతో బారామతి స్థానంలో ఉప ఎన్నిక జరిగింది. ఈ స్థానం పవార్ కుటుంబానికి బలమైన కంచుకోటగా భావిస్తారు. అక్కడ ఎన్సీపీ తరపున పోటీ చేసిన ఆయన భార్య సునేత్ర పవార్ రికార్డు మెజార్టీతో గెలిచింది. అదే రాష్ట్రంలోని రాహురి నియోజకవర్గంలో మాత్రం బీజేపీ అభ్యర్థి అక్షయ్ శివాజీరావ్, కాంగ్రెస్ అభ్యర్థిపై లక్షకు పైగా ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు.
కర్ణాటకలో కూడా ఉప ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. బాగల్కోట్లో కాంగ్రెస్ అభ్యర్థి ఉమేశ్ మేటి బీజేపీపై మంచి మెజార్టీతో గెలిచారు. దావణగెరె సౌత్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థి సమర్థ్ మల్లికార్జున స్వల్ప తేడాతో విజయాన్ని నమోదు చేశారు. ఈ రెండు స్థానాలు కాంగ్రెస్కు ఊరటనిచ్చాయి.
గుజరాత్, నాగాలాండ్ లోనూ బీజేపీ విజయం
గుజరాత్లోని ఉమ్రత్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి హర్షత్ పర్మార్ గెలుపొందారు. తన తండ్రి మరణంతో ఖాళీ అయిన ఈ స్థానాన్ని ఆయన సొంతం చేసుకున్నారు. నాగాలాండ్లోని కోరిడాండ్లో బీజేపీ అభ్యర్థి దావోచియర్ ఇమ్చన్, స్వతంత్ర అభ్యర్థిపై స్వల్ప తేడాతో గెలిచారు. త్రిపురలోని ధర్మనగర్లో కూడా బీజేపీ అభ్యర్థి జహర్ చక్రబరోటి సీపీఐ(ఎం) అభ్యర్థిపై స్పష్టమైన మెజార్టీతో విజయం సాధించారు.