-
ఐదు హామీలను ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షరాలు
-
యువత, మహిళలే టార్గెట్
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: పదునైన మాటలతో, ఆయుధం లాంటి రాజకీయ వ్యూహంతో తెలంగాణ పాలిటిక్స్ లో పూర్తిస్థాయి నాయకురాలిగా అడుగుపెట్టారు కల్వకుంట్ల కవిత. ఆవిర్భావ సభలో ఆమె చేసిన ప్రసంగం రాజకీయ విశ్లేషకులకు సైతం ఆశ్చర్యం కలిగించింది. ఆమె కేవలం భావోద్వేగాన్ని మాత్రమే ప్రదర్శించలేదు. కెసిఆర్ కు అసలు సిసలైన వారసురాలిగా ఆమె ప్రదర్శించిన మాటల తీరు అందర్నీ ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ సభలో ‘పాంచజన్యం’ పేరుతో ఐదు ప్రధాన హామీలను ప్రకటించారు..
1. ఐదు హామీల్లో ప్రధానమైనది విద్య. ప్రైవేటు పాఠశాలల్లో సైతం ఉచిత విద్య అందిస్తామని కవిత ప్రకటించారు. అన్ని పాఠశాలల్లో ఉచిత విద్యను అమలు చేస్తామని చెప్పుకొచ్చారు.2. వైద్యాన్ని సైతం అన్నిచోట్ల ఉచితం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులను తేడా లేకుండా అన్ని రుగ్మతలకు ఉచిత వైద్యం అందించాలన్నది తమ పార్టీ సంకల్పంగా చెప్పుకొచ్చారు.
3. రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ తో పాటు సాగు ప్రోత్సాహం అందిస్తామని చెప్పారు. పండిన పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామన్నారు. యూరియాతోపాటు ఎరువులను ఇంటి వద్దకే సరఫరా చేస్తామని చెప్పారు.
4. యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ పార్టీ లక్ష్యంగా చెప్పారు. నిరుద్యోగ యువత ప్రభుత్వ ఉద్యోగాలకు ఎదురు చూడకుండా ఉపాధి కల్పనపై దృష్టి పెడితే రూ.2 లక్షల నుంచి 20 కోట్ల వరకు రుణాలు అందిస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన మొదటి యాడాదిలోనే నాలుగు లక్షల ఉద్యోగాల భర్తీ ఉంటుందని ప్రకటించారు.
5. సామాజిక న్యాయం పాటించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సమాన అవకాశాలు కల్పిస్తామన్నారు. ఆదివాసీ లంబాడాల అభివృద్ధి కోసం ప్రత్యేక కార్పొరేషన్లు, సొంత ఇంటి కలను నెరవేర్చుతామన్నారు.