కామారెడ్డి, క్రైమ్ మిర్రర్: జిల్లాలో ఎలుగవంటి సంచారంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఎలుగుబంటి ఓ రైతు పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది. దాడి ఘటనతో అతడి పరిస్థితి విషమంగా ఉంది. రెడ్డిపేట స్కూల్ తండాకు చెందిన సలావత్ మత్తు(45), అతడి భార్య.. కట్టెల కోసం అడవికి వెళ్లారు. ఈ సమయంలో ఒక్కసారిగా మత్తుపై ఎలుగుబంటి దాడి చేసింది. రైతు ముఖంపై బలమైన గాయాలు అయ్యాయి. ఎలుగుబంటిని చూసిన వెంటనే మత్తు భార్య, స్థానికులు కేకలు వేశారు.
దీంతో ఎలుగుబంటి అక్కడి నుంచి అడవిలోకి పారిపోయింది. తీవ్రంగా గాయపడిన మత్తును హుటాహుటిన కామారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మత్తు పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. రైతుపై ఎలుగుబంటి దాడి చేసినట్లు స్థానిక సర్పంచ్ వెల్లడించారు. ఈ ఘటనతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.