Woman Kills Baby After Delivery: కర్ణాటకలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. పుట్టిన వెంటనే ఓ శిశువును తల్లి హతమార్చిన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన ఓ ప్రముఖ కంపెనీ ప్రాంగణంలో చోటుచేసుకోవడం మరింత సంచలనంగా మారింది. పోలీసులు కేసు నమోదు చేసి యువతిని అదుపులోకి తీసుకున్నారు.
అసలేం జరిగిందంటే?
దేవనహళ్లి ప్రాంతంలోని ఓ మల్టీ నేషనల్ కంపెనీలో పని చేస్తున్న 19 ఏళ్ల యువతికి విధుల్లో ఉండగా ఆకస్మికంగా కడుపు నొప్పి వచ్చింది. దీంతో ఆమె బాత్ రూమ్కు వెళ్లింది. అక్కడే ఆమెకు ప్రసవం జరిగింది. అయితే, ఈ విషయం బయటకు తెలియకుండా ఉండాలనే భయంతో, పుట్టిన శిశువును అక్కడికక్కడే హత్య చేసింది. తర్వాత ఆ మృతదేహాన్ని ఒక సంచిలో వేసి అక్కడి నుంచి బయటకు వచ్చింది.
కొద్దిసేపటి తర్వాత అదే బాత్రూమ్కి వెళ్లిన మరో మహిళ రక్తపు మరకలు, సంచిలో ఉన్న శిశువు మృతదేహాన్ని గమనించింది. వెంటనే ఈ విషయం సంస్థ అధికారులకు తెలియజేశారు. వారు పోలీసులకు సమాచారం అందించడంతో, పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని దర్యాప్తు మొదలుపెట్టారు.
యువతిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
దర్యాప్తులో భాగంగా యువతిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఆమెను ప్రశ్నించగా, తనకు వివాహం కాలేదని, ఒక వ్యక్తితో సంబంధం వల్ల గర్భవతిగా మారినట్లు వెల్లడించింది. ఈ విషయం బయటపడుతుందనే భయంతోనే పుట్టిన వెంటనే శిశువును చంపినట్లు ఒప్పుకుంది. ఆమె చెప్పిన విషయాలు విని అక్కడున్న వారు దిగ్భ్రాంతికి గురయ్యారు. ప్రస్తుతం యువతికి ఆరోగ్య సమస్యలు ఉండటంతో ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు పోలీసులు కేసును నమోదు చేసి, ఈ ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.