-
ఖాకీ ఇంటికే “కన్నం”
-
శాంతిభద్రతల దుస్థితికి ఇదే నిదర్శనం!
యాచారం (క్రైమ్ మిర్రర్): యాచారం మండలం నందివనపర్తిలో, కానిస్టేబుల్ వెంకటేష్ ఇంట్లో జరిగిన దొంగతనం కేవలం ఒక నేర ఘటన మాత్రమే కాదు, అది నేటి శాంతిభద్రతల దుస్థితికి అద్దం పడుతున్న చేదు నిజం. ఓ శుభకార్యానికి వెళ్లిన రక్షకుడి ఇల్లు గుల్లయింది అంటే, నేరగాళ్లకు పోలీసులన్నా, చట్టాలన్నా ఎంతటి నిర్లక్ష్యం ఉందో అర్థం చేసుకోవచ్చు. బీరువాలో దాచుకున్న 65 వేల నగదు, రెండున్నర తులాల బంగారం, 20 తులాల వెండిని దోచుకెళ్లిన దుండగులు, పరోక్షంగా వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపారు.
రాత్రింబవళ్లు సమాజ రక్షణ కోసం శ్రమించే ఒక పోలీస్ అధికారి ఇల్లే సురక్షితం కానప్పుడు, సామాన్య పౌరుడు తన ఇంట్లో ప్రశాంతంగా నిద్రపోయే పరిస్థితి ఉందా? అనే ప్రశ్న ఇప్పుడు ప్రతి ఒక్కరినీ వేధిస్తోంది. పోలీస్ శాఖ అధునాతన సాంకేతికతను వాడుతున్నామని, పెట్రోలింగ్ ముమ్మరం చేశామని చెబుతున్నా, ఇలాంటి ఘటనలు క్షేత్రస్థాయిలో వైఫల్యాలను ఎత్తిచూపుతున్నాయి. గస్తీ వ్యవస్థ కేవలం రోడ్లకే పరిమితమైందా? నివాస ప్రాంతాల్లో నిఘా నీడ గమ్యం ఎటు? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
రక్షకుడి ఇల్లు దొంగల పాలవ్వడం అనేది, పోలీస్ డిపార్ట్మెంట్ ఆత్మరక్షణలో పడాల్సిన విషయం. క్లూస్ టీమ్లు వచ్చి వేలిముద్రలు సేకరించడం, కేసు నమోదు చేయడం అనేది ఆనవాయితీగా మారుతుందే తప్ప, నేరాలు జరగకుండా నిరోధించడంలో గట్టి చర్యలు ఎందుకు కనిపించడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.!? అధికారుల నిర్లక్ష్యం వీడాలి, నిఘా పెరగాలని స్థానికులు అంటున్నారు.! ఈ ఘటన కేవలం ఒక దొంగతనం మాత్రమే కాదు, సామాన్యుడి భద్రతపై పోలీస్ శాఖకు విసిరిన సవాల్ లా మారింది..! ఇప్పటికైనా యంత్రాంగం చలించి, నేరగాళ్ల గుండెల్లో వణుకు పుట్టించేలా, కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాకీ ఇంట్లోనే కన్నం పడిందంటే ఇక సామాన్యుడి రక్షణ ఎవరి బాధ్యతని రోడ్డెక్కి అడిగే రోజులు దూరంలో లేవని మండల ప్రజలు అనుకొస్తున్నారు.. చూడాలి ఈ కేసులో పోలీసుల దూకుడు..
