పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావంతో దేశంలో ఇంధన ధరలు పెరుగుతాయనే వార్తలు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం పొందాయి. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్తో పాటు వంట గ్యాస్ ధరలు కూడా పెరగబోతున్నాయనే సందేశాలు ప్రజల్లో గందరగోళాన్ని సృష్టించాయి. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇస్తూ కీలక ప్రకటన చేసింది. దేశంలో ప్రస్తుతం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచే యోచన లేదని స్పష్టం చేస్తూ ప్రజల్లో నెలకొన్న అనుమానాలకు ముగింపు పలికింది.
ఇంధన ధరలు పెరుగుతాయనే ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని కేంద్రం తెలిపింది. అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు పెరుగుతున్నప్పటికీ దేశీయంగా ధరలను పెంచే ఉద్దేశం లేదని సంబంధిత శాఖ వెల్లడించింది. ప్రజలు అవసరానికి మించి భయపడుతూ ఇంధన నిల్వలు చేసుకునే ప్రయత్నాలు చేయవద్దని కూడా విజ్ఞప్తి చేసింది. దేశంలో ప్రస్తుతం రెండు నెలలకు సరిపడే ఇంధన నిల్వలు అందుబాటులో ఉన్నాయని అధికారులు వెల్లడించారు.
ఈ అంశంపై పెట్రోలియం శాఖకు చెందిన సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ.. పెట్రోల్, డీజిల్ సరఫరాలో ఎలాంటి అంతరాయం ఉండదని తెలిపారు. అంతేకాకుండా గృహ వినియోగ వంట గ్యాస్ ధరలను కూడా పెంచే ఆలోచన లేదని స్పష్టం చేశారు. దీంతో వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో పుట్టుకొస్తున్న తప్పుడు ప్రచారాలు ప్రజల్లో అనవసరమైన భయాందోళనలకు దారి తీస్తున్నాయని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు అధికారిక ప్రకటనలను మాత్రమే విశ్వసించాలని సూచించారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన సమాచారం వచ్చినప్పుడే నిర్ణయాలు తీసుకోవాలని హెచ్చరించారు. తప్పుడు సమాచారాన్ని నమ్మి అనవసరంగా ఖర్చులు పెట్టడం, నిల్వలు చేయడం మానుకోవాలని సూచించారు.
ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో ఇంధన సరఫరా స్థిరంగా కొనసాగుతోందని కేంద్రం స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం నిరంతరం పరిస్థితులను పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటోందని తెలిపింది. దీంతో ప్రజలు ఆందోళన చెందకుండా సాధారణంగా తమ అవసరాలను కొనసాగించవచ్చని అధికారులు వెల్లడించారు.
