సిక్కిం సీఎం పవన్ కుమార్ రికార్డు బ్రేక్
మోడీ అంటే రాజకీయ వర్గాల్లో వైబ్రేషన్
ఆయన జీవితమే ఒక రాజకీయ పుస్తకం
ఢిల్లీ, క్రైమ్ మిర్రర్: ప్రధాని నరేంద్ర మోదీ అరుదైన మైలురాయిని చేరుకున్నారు. మనదేశంలో సుదీర్ఘకాలం పాటు ప్రభుత్వాధినేతగా వ్యవహరించిన రికార్డును ప్రధాని మోదీ సొంతం చేసుకున్నారు. సిక్కిం మాజీ సీఎం పవన్ కుమార్ చామ్లింగ్ రికార్డును మోదీ ఆదివారంతో అధిగమించారు.
సీఎంగా 8,930 రోజుల పాటు సేవలను అందించిన రికార్డు పవన్ కుమార్ చామ్లింగ్ పేరిట ఉన్న రికార్డును మోదీ బద్దలు కొట్టారు. గుజరాత్ సీఎంగా, దేశ ప్రధానిగా ప్రభుత్వాధినేత హోదాలలో నరేంద్ర మోదీ 8,931 పనిదినాలను పూర్తి చేసుకుని అరుదైన భారత రాజకీయ వేత్తగా నిలిచారు. దీర్ఘకాలం పాటు గుజరాత్ సీఎంగా వ్యవహరించిన రికార్డు నరేంద్రమోదీ పేరిట ఉంది.
సీఎంగా …
2001 అక్టోబరు 7 నుంచి 2002 డిసెంబరు 22 వరకు
2002 డిసెంబరు 22 నుంచి 2007 డిసెంబరు 22 వరకు
2007 డిసెంబరు 23 నుంచి 2012 డిసెంబరు 20 వరకు
2012 డిసెంబరు 20 నుంచి 2014 మే 22 వరకు నాలుగు దఫాలు ఆయన సీఎంగా వ్యవహరించారు.
2014 నుంచి మోదీ వరుసగా మూడు పర్యాయాలు దేశ ప్రధానిగా ఎన్నికయ్యారు.
మోడీ ఓ రాజకీయ ప్రబలశక్తి…
ప్రజాస్వామ్యంలో రాజకీయ గెలుపు సాధించడమే అంతిమం కాదని నిరూపించిన నాయకుడు భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ అని చెప్పవచ్చు. అధికారాన్ని సుస్థిర పరచడం అత్యంత నైపుణ్యాన్ని ఆయన ప్రతీసారి నిరూపిస్తూ వచ్చారు. అధికారాన్ని సంపాదించడం కంటే, దాన్ని స్థిరపరుచుకోవడంలోనే నాయకుడి అసలైన సామర్థ్యం బయటపడుతుందన్నది రాజకీయ నానుడి. ఆ విషయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ వందకు వందశాతం విజయవంతమవుతూ వస్తున్నారు.
నరేంద్రమోదీ ప్రస్థానం ఒక నిర్మిత రాజకీయ ప్రయోగశాల. పరిస్థితులను అర్థం చేసుకోవడం, వాటిని రాజకీయంగా మల్చుకోవడంలో ఆయన్ను మించిన భారత రాజకీయ వేత్తల్లో సాటిలేరన్నది విశ్లేషకుల అభిప్రాయం. గుజరాత్లో అధికార బాధ్యతలు చేపట్టిన తొలి దశలోనే ఆయన తన శైలిని స్పష్టంగా ప్రకటించారు. సంక్షోభాన్ని ఎదుర్కొనే నాయకుడిగానే కాకుండా, సంక్షోభాన్ని అవకాశంగా మలిచే వ్యూహకర్తగా ముందుకొచ్చారు.
పునర్నిర్మాణాన్ని పరిపాలనా చర్యగా కాకుండా, అభివృద్ధిగా మలచడం ద్వారా ఆయన ఒక కొత్త రాజకీయ వైఖరిని సృష్టించారు. ఆయన గుజరాత్లో సాధించి పెట్టిన అభివృద్ధి బ్రాండ్ బీజేపీకి దేశ వ్యాప్తంగా మరెంతో కీర్తిని తెచ్చిపెట్టింది. దేశవ్యాప్తంగా “గుజరాత్ మోడల్” ప్రచారంలోకి వచ్చింది. నరేంద్రమోదీ దేశ రాజకీయాల్లోకి ప్రవేశంతోనే వైబ్రేషన్ మొదలైంది.
గుజరాత్లో 12 ఏళ్లు సీఎంగా పనిచేసిన అనుభవం ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చిన తీరు కలగలిసి 2014ఎన్నికల్లో బీజేపీకి పెద్ద ఆస్తిగా మారాయి. పాత రాజకీయాలతో విసిగిపోయిన ఓటరుకు కొత్త ఆశగా, వ్యవస్థపై అసంతృప్తి ఉన్న వర్గాలకు కొత్త అవకాశంగా తనను తాను ప్రతిష్టించుకోవడంలో మోదీ సక్సెస్ అయ్యారు. ఫలితంగానే 2014లో జరిగిన దేశ రాజకీయ మార్పునకు కారణమైంది.
మోదీ రాజకీయ ప్రయాణాన్ని పరిశీలిస్తే, అది ఒక నిరంతర రూపాంతర క్రమంలా కనిపిస్తుంది. ఒక దశలో భావోద్వేగాల ప్రతినిధిగా, మరొక దశలో అభివృద్ధి శిల్పిగా, ఇంకొక దశలో జాతీయ గర్వానికి ప్రతీకగా కనిపిస్తారు. ఈ రీ-బ్రాండింగ్ సామర్థ్యమే ఆయనను ఒక వ్యక్తి నుంచి ఒక రాజకీయ ప్రబల శక్తిగా మార్చిందని చెప్పాలి.
