తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోవడంతో ప్రజలు అప్రమత్తమయ్యే పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్తో పాటు పరిసర ప్రాంతాల్లో పరిస్థితి మరింత ప్రభావవంతంగా కనిపిస్తోంది.
వాతావరణ కేంద్రం తాజా బులెటిన్ ప్రకారం.. రంగారెడ్డి జిల్లా, మేడ్చల్ జిల్లా, సంగారెడ్డి జిల్లా ప్రాంతాల్లో ఇవాళ సాయంత్రంలోపు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాతావరణంలో చోటుచేసుకున్న మార్పుల కారణంగా బలమైన ఈదురు గాలులు వీస్తాయని అధికారులు స్పష్టం చేశారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే సూచనలు ఉన్నాయని హెచ్చరించారు.
ప్రత్యేకంగా సంగారెడ్డి, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఇస్నాపూర్, పాశమైలారం, రుద్రారం, కంది, సదాశివపేట ప్రాంతాల్లో భారీ ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల వడగళ్ల వాన కూడా పడే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ అకాల వర్షాల కారణంగా రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట కోతకు సిద్ధమైన సమయంలో వడగళ్లు పడితే తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పటాన్ చెరు, మదీనాగూడ, బాచుపల్లి ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని అంచనా వేస్తున్నారు. నగరంలోని ఇతర ప్రాంతాల్లో రాబోయే రెండు గంటల్లో అక్కడక్కడ చినుకులు పడే అవకాశం ఉంది. మేఘావృతమైన ఆకాశంతో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. వేసవి వేడి నుంచి కొంత ఉపశమనం లభించినప్పటికీ, బలమైన ఈదురు గాలులు జనజీవనాన్ని ప్రభావితం చేస్తున్నాయి.
ఈ పరిస్థితుల్లో విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. గాలుల వేగం పెరగడంతో చెట్లు విరిగి పడే ప్రమాదం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. వర్షం సమయంలో విద్యుత్ స్తంభాలు, తెగిన వైర్లకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.
ALSO READ: ఘనంగా మంచు లక్ష్మి కూతురి ఓణీల వేడుక
