మెదక్, క్రైమ్ మిర్రర్: తెలంగాణలో టమాటా ధరలు దారుణంగా పడిపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో, గిట్టుబాటు ధర రాకపోగా కూలీల ఖర్చులు కూడా రాకపోవడంతో ఒక రైతు తన పంటను ప్రజలకు ఉచితంగా పంచేశాడు. కిలో రూ.2 కంటే తక్కువ ధర పలకడంతో, 1200 కిలోల టమాటాలను రోడ్డుపైనే ఉచితంగా పంపిణీ చేశారు,
దీనికోసం జనం బుట్టలు,సంచులతో ఎగబడ్డారు. మహబూబాబాద్, కొత్తగూడ మార్కెట్లో రైతులకు గిట్టుబాటు ధర లేక నిరసనగా టమాటాలు ఫ్రీగా ఇచ్చారు. రవాణా ఖర్చులు, కోత కూలీలు కూడా రాకపోవడంతో రైతులు పంటను పొలాల్లోనే వదిలేస్తుండడం రాష్ట్రంలో రైతు పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. భారీగా పెట్టుబడి పెట్టి టమాట పంటను పండించి కోసి మార్కెట్కు తీసుకువస్తే కనీసం రవాణా ఖర్చులు కూడా రావడం లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు వినియోగదారులకు మాత్రం టమాట అంత తక్కువ ధరకు దొరకడం లేదు. మధ్యలో ఉన్న దళారులే టమాటపై భారీగాలాభాలు పొందుతున్నారు. రాష్ట్ర సర్కార్ స్పందించి టమాటకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు వేడుకుంటున్నారు.ఇదిలా ఉండగా మార్కెట్లో మాత్రం వినియోగదారులకు కిలో టమాటా రూ.20 కి తక్కువకు దొరకకపోవడం గమనార్హం
