Ownly: టూ వీలర్ రైడింగ్ సేవల రంగంలో అగ్రగామిగా నిలిచిన ర్యాపిడో తాజాగా సంచలనాత్మక నిర్ణయం తీసుకొని ఆహార సరఫరా రంగంలోకి అడుగుపెట్టింది. ‘ఓన్లీ’ పేరుతో సరికొత్త యాప్ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి కస్టమర్లకు, రెస్టారెంట్లకు సమానంగా లాభదాయకంగా ఉండే విధంగా ప్రత్యేక విధానాన్ని అమలు చేస్తోంది. ఇప్పటివరకు ఆహార సరఫరా రంగంలో ఉన్న సంస్థలు రెస్టారెంట్లల నుంచి గణనీయమైన శాతం రుసుములను వసూలు చేస్తూ వచ్చాయి. ఆ భారాన్ని రెస్టారెంట్లు వినియోగదారులపై మోపడంతో భోజన ధరలు పెరగడం సాధారణమైంది. అయితే ఓన్లీ యాప్ మాత్రం రెస్టారెంట్ల నుంచి ఎలాంటి శాతం రుసుము వసూలు చేయబోమని స్పష్టంగా ప్రకటించింది. ఈ నిర్ణయంతో రెస్టారెంట్లు తమ భోజన పట్టిక ధరలను పెంచాల్సిన అవసరం లేకుండా, వినియోగదారులకు హోటల్ వద్ద ఉన్న అసలు ధరలకే ఆహారం అందే అవకాశాలు ఏర్పడుతున్నాయి.
ఇతర సంస్థలు అమలు చేస్తున్న విధంగా ప్లాట్ఫామ్ ఫీజులు, అదనపు ఛార్జీలు, వంటివి ఈ కొత్త యాప్లో ఉండవని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. వినియోగదారులు తాము ఆర్డర్ చేసిన ఆహారానికి సంబంధించిన మొత్తం మరియు డెలివెరీ ఛార్జీలు మాత్రమే చెల్లిస్తే సరిపోతుందని స్పష్టం చేశారు. కృత్రిమంగా ధరలను పెంచడం, అనవసర రుసుములు జోడించడం వంటి విధానాలకు తాము దూరంగా ఉంటామని సంస్థ పేర్కొంది. ఈ విధానం వల్ల వినియోగదారుల విశ్వాసం పెరగడంతో పాటు రెస్టారెంట్లు కూడా లాభదాయక వాతావరణం ఏర్పడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా చిన్న మరియు మధ్య తరహా రెస్టారెంట్లు భారీ ఛార్జీల భారం లేకుండా తమ వ్యాపారాన్ని విస్తరించుకునే అవకాశాన్ని ఇది కల్పించనుంది.
ప్రస్తుతం ఈ సేవలను బెంగళూరులో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ర్యాపిడో, అక్కడి స్పందనను విశ్లేషించి త్వరలోనే హైదరాబాద్, ఢిల్లీ, కోల్కతా, ముంబై వంటి ప్రధాన మహానగరాలకు విస్తరించే యోచనలో ఉంది. తక్కువ ధరలకు నాణ్యమైన ఆహారాన్ని వినియోగదారులకు చేరవేయడమే తమ ముఖ్య లక్ష్యమని సంస్థ పేర్కొంది. ఇప్పటికే ఫుడ్ డెలివరీ రంగంలో ఆధిపత్యం కొనసాగిస్తున్న జొమాటో, స్విగ్గీ వంటి సంస్థలకు ఈ కొత్త విధానం గట్టి పోటీగా మారే అవకాశముందని వ్యాపార నిపుణులు అంచనా వేస్తున్నారు. అధిక ఛార్జీలు లేకుండా, పారదర్శక విధానంతో ముందుకు సాగుతున్న ఈ ప్రయత్నం విజయవంతమైతే ఆహార సరఫరా రంగంలో కొత్త దిశకు నాంది పలికినట్లే అవుతుందని విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి.
ALSO READ: Keshav Rao: విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావడమే లక్ష్యం
