తాజా పరిస్థితులపై ప్రధాని మోడీ ఆరా
గల్ఫ్ దేశాలపై జరుగుతున్న దాడుల ఖండన
మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని మోడీ అరబ్ దేశాల అధినేతలతో ఫోన్ లో మాట్లాడారు. గల్ఫ్ దేశాలపై దాడులు జరుగుతున్న వైనంపై ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడి భారతీయుల భద్రత, సంక్షేమంపై కూడా చర్చించారు.
ఏ దేశాధినేతలో మాట్లాడారంటే?
ఒమాన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిఖ్, కువైట్ యువరాజు షేఖ్ సబా, ఖతార్ ఎమిర్ షేఖ్ తమీమ్లతో ప్రధాని ఫోన్లో మాట్లాడారని అధికార వర్గాలు తెలిపాయి. ఇటీవల బహ్రెయిన్, సౌదీ అరేబియా పాలకులతో కూడా ప్రధాని మోడీ మాట్లాడారు. గల్ఫ్ దేశాలపై జరుగుతున్న దాడులను ఖండించారు. ఈ దాడులు గల్ఫ్ దేశాల సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడమేనని స్పష్టం చేశారు. ఈ క్లిష్ట సమయంలో భారత్ గల్ఫ్ పౌరులకు అండగా ఉంటుందని కూడా హామీ ఇచ్చారు. జోర్డాన్ రాజుతో కూడా మాట్లాడిన ప్రధాని మోడీ సంఘీభావాన్ని ప్రకటించారు. యూఏఈ అధ్యక్షుడు, ఇజ్రాయెలీ ప్రధానితో కూడా మాట్లాడి అక్కడి పరిస్థితి గురించి ఆరా తీశారు.
గల్ఫ్ దేశాల్లో 90 లక్షల మంది భారతీయులు
పశ్చిమాసియా, గల్ఫ్ దేశాల్లో సుమారు 90 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు. ఇరాన్లో 10 వేల మంది చదువు, ఉద్యోగాల కోసం ఉంటుండగా, ఇజ్రాయెల్లో 40 వేల మంది భారతీయులు ఉంటున్నారు. ప్రస్తుతం పశ్చిమాసియా గగనతలం మీదుగా విమానాల రాకపోకలు దాదాపుగా నిలిచిపోయాయి. దీంతో, అనేక మంది భారతీయులు దుబాయ్, దోహా సహా పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. ఈ విషయమై ఆదివారం కేబినెట్ కమిటీ కూడా సమావేశమై చర్చించింది.
