క్రైమ్ మిర్రర్ : ఉత్తరప్రదేశ్లోని మీరట్లో ఓ ఎస్సైపై యువతి చేసిన ఫిర్యాదు కలకలం రేపుతోంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనకు దగ్గరై, అనంతరం లైంగికంగా వేధించడంతో పాటు బెదిరింపులకు పాల్పడ్డాడని ఢిల్లీకి చెందిన 29 ఏళ్ల యువతి ఆరోపించింది. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలి వివరాల ప్రకారం.. 2025 సెప్టెంబర్లో మీరట్కు చెందిన ఎస్సై లలిత్ మోహన్తో ఆమెకు పరిచయం ఏర్పడింది. తనకు అవసరమైన సమయంలో సహాయం చేస్తానని చెప్పడంతో ఇద్దరి మధ్య పరిచయం క్రమంగా పెరిగినట్లు తెలిపింది. ఆ తర్వాత తనను పెళ్లి చేసుకుంటానని ఎస్సై హామీ ఇచ్చి, తనకు మరింత దగ్గరయ్యాడని ఫిర్యాదులో పేర్కొంది.
యూపీపీఎస్సీ పరీక్షకు సిద్ధమవుతున్న తనకు చదువుకు సంబంధించిన నోట్స్ ఇస్తానని చెప్పి మీరట్కు పిలిచాడని యువతి తెలిపింది. అక్కడికి వెళ్లిన తర్వాత తనను ఓ గదిలోకి తీసుకెళ్లి తన ఇష్టానికి వ్యతిరేకంగా లైంగికంగా దాడి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటన అనంతరం ఎస్సై తనను క్రమంగా దూరం పెట్టడం ప్రారంభించాడని యువతి తెలిపింది. పెళ్లి గురించి పలుమార్లు ప్రశ్నించడంతో తనను బెదిరించినట్లు ఆరోపించింది. దీంతో విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేసి పోలీసులను ఆశ్రయించినట్లు పేర్కొంది.
తనతో సంబంధాలు కొనసాగించకుండా ఉండేందుకు చివరకు తన బ్యాంకు ఖాతాలో రూ.10 వేలు జమ చేసి, ఆ తర్వాత ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి అందుబాటులో లేకుండా పోయాడని యువతి ఆరోపించింది. ఈ పరిణామాలతో తాను తీవ్రంగా ఆందోళనకు గురయ్యానని తెలిపింది. బాధితురాలి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. యువతి చేసిన ఆరోపణలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఫిర్యాదులో పేర్కొన్న అంశాలు, అందుబాటులో ఉన్న ఆధారాలు, ఇరువర్గాల వాదనలను పరిశీలించిన అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.
also read : కుక్కను చూసి భయపడి బావిలోకి పడిన బాలిక.. సురక్షితంగా రక్షణ
