క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: చైర్మన్ పీఠాన్ని దక్కించుకునే క్రమంలో పార్టీల మధ్య క్యాంపు రాజకీయాలు, ఎత్తుకు పై ఎత్తులు నడుస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రము రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో హైటెన్షన్ నెలకొంది.
ఈ రోజు సోమవారం ఫిబ్రవరి 16న మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరగాల్సి ఉండగా, ఇద్దరు వార్డు సభ్యులు అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. చైర్మన్ ఎన్నికకు ముందే ఈ పరిణామాలు చోటుచేసుకోవడం సంచలనంగా మారింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే…ఇటీవలే జరిగిన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఎన్నికల్లో ఇక్కడ బీఆర్ఎస్-13, కాంగ్రెస్-8, బీజేపీ-2, స్వతంత్రుడు-1 స్థానాలను గెలుచుకున్నారు. అయితే 3వ వార్డు స్వతంత్ర అభ్యర్థి దాసరి మురళీకృష్ణను ఎవరో కిడ్నాప్ చేశారని ఆయన తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
అదేవిధంగా, 19వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి ఆకుల యాదగిరి కూడా కనిపించడం లేదని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది. ఇబ్రహీంపట్నమే కాకుండా జమ్మికుంటలో కూడా ఇద్దరు బీఆర్ఎస్ కౌన్సిలర్లను కాంగ్రెస్ నేతలు కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారని ఆరోపణలు వస్తున్నాయి.
