
చింతపల్లి,క్రైమ్ మిర్రర్:- విద్యాబుద్ధులు నేర్పించి, విద్యార్థులను ఉత్తమ పౌరులుగా, తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయుడు కాస్తా కీచకుడిగా మారాడు. కన్న బిడ్డల్లా చూసుకోవాల్సిన బాలిక పట్ల, అసభ్యంగా ప్రవర్తించి ఆ పవిత్రమైన వృత్తికే మాయని మచ్చ తెచ్చాడు. చింతపల్లి మండలం మాల్ పరిధిలోని, వీటి నగర్ ప్రాథమిక పాఠశాలలో, శనివారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
అసలు ఎం జరిగింది..?
మండలంలోని మాల్ ప్రాథమిక పాఠశాలలో, దేవ్లా అనే వ్యక్తి ఎస్జీటీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. అసలు ఇతని పోస్టింగ్ తక్కెళ్ళపల్లిలో ఉండగా, గత ఐదు నెలలుగా డిప్యూటేషన్పై మాల్ స్కూలుకు వస్తున్నాడు. అయితే, సదరు ఉపాధ్యాయుడు నిత్యం మద్యం మత్తులో, పాఠశాలకు రావడం అలవాటుగా మార్చుకున్నాడు. ఈ క్రమంలోనే పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్న, ఒక బాలికపై గత కొన్ని రోజులుగా అసభ్యకరంగా ప్రవర్తిస్తూ వేధింపులకు గురిచేస్తున్నాడు.
బయటపడ్డ బండారం… మెరుగైన దేహశుద్ధి
ఉపాధ్యాయుడి ప్రవర్తనతో భయాందోళనకు గురైన బాలిక, ధైర్యం చేసి ఇంట్లో తల్లిదండ్రులకు విషయాన్ని వివరించింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన కుటుంబ సభ్యులు, బంధువులు శనివారం ఉదయం పాఠశాలకు చేరుకున్నారు. సదరు ఉపాధ్యాయుడిని నిలదీస్తూ, క్లాస్ రూమ్ నుండి బయటకు లాక్కొచ్చి దేహశుద్ధి చేశారు. గ్రామస్థులు కూడా తోడవడంతో పాఠశాల ప్రాంగణంలో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. అనంతరం నిందితుడిని పోలీసులకు అప్పగించారు.
విచారన.. ఆపై సస్పెన్షన్ వేటు
ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో, విద్యాశాఖ అధికారులు తక్షణమే స్పందించారు. జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాల మేరకు, మండల విద్యాశాఖ అధికారి నీరుడు అంజయ్య, పాఠశాలను సందర్శించి విచారణ చేపట్టారు. జరిగిన ఘటనపై పూర్తి నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించగా, బాధ్యుడైన ఉపాధ్యాయుడు దేవ్లాను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
కీచక ఉపాధ్యాయుడి సస్పెండ్ పై స్థానికులు హర్షం వ్యక్తం చేసారు.. కేవలం సస్పెండ్ చెయ్యడమే కాకుండా, జైలుకు పంపాలని ప్రజలు కోరుతున్నారు.



