- తరచూ వారితో సమావేశం అవుతున్నారు
- విదేశీ పర్యటనల్లో ఇదే జరుగుతోంది
- కేంద్రమంత్రి కిరణ్ రిజజు సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, క్రైమ్ మిర్రర్:కాంగ్రెస్ పార్టీ అగ్రనేత , లోక్సభలో విపక్షనేత రాహుల్ గాంధీ పై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు నిప్పులు చెరిగారు. రాహుల్గాంధీకి భారత వ్యతిరేక శక్తులతో సంబంధాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. విదేశీ పర్యటనల సమయంలో విపక్షనేత వేర్పాటువాదులు, మావోయిస్టులు, అమెరికాకు చెందిన ప్రముఖ పెట్టుబడిదారుడు జార్జిసోరస్ లాంటి వ్యక్తులతో సమావేశమవుతున్నారని అన్నారు.
దేశ వ్యతిరేక శక్తులతో చేతులు కలిపే ఆయన జాతీయ భద్రతకు చాలా ప్రమాదక రమని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు. ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రిజిజు ఈ వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానానికి ప్రతిపక్షాలు సిద్ధమవడంపై కూడా రిజిజు మాట్లాడారు. ప్రతిపక్షాలపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ నేతలు, ముఖ్యంగా రాహుల్గాంధీ వారి వ్యాఖ్యలతో చర్చలకు అంతరాయం కలిగిస్తారని అన్నారు.
దేశ చరిత్రలో ఎప్ప్పుడూ ఆయనలాంటి ప్రతిపక్ష నేతను చూడలేదని రిజిజు విమర్శించారు. పార్లమెంట్ సమావేశాలు జరగనీయకూడదనే ఉద్దేశంతో కాగితాలు విసిరేయడం, నినాదాలు చేస్తూ వాకౌట్ చేయడం వంటి చిన్న పిల్లల చర్యలు చేస్తుంటారని అసహనం వ్యక్తంచేశారు. రాహుల్గాంధీ ఇలా సభకు అంతరాయం కలిగించడంవల్ల ప్రజల సమస్యల గురించి మాట్లాడాలనుకునే వారికి అవకాశం దక్కట్లేదని తెలిపారు.
అమెరికా ప్రభుత్వానికి భారత్ తలొగ్గిందని, జాతీయ ప్రయోజనాలతో రాజీ పడుతోందని ఇటీవల లోక్సభలో రాహుల్ ఆరోపించారు. కాగా ఈ నెల 12న లోక్సభలోరాహుల్కు వ్యతిరేకంగా బీజేపీపార్లమెంట్ సభ్యుడు నిషికాంత్ దూబే తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. రాహుల్ పార్లమెంటరీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని, ఎన్నికల్లో పోటి చేయకుండానిషేధించాలని కోరారు. ఈ నేపథ్యంలో రాహుల్ పై కిరణ్ రిజిజు సైతం తాజాగా వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతనుసంతరించుకున్నాయి.