దాద్రా నగర్ హవేలీ కేంద్రపాలిత ప్రాంతంలో జరిగిన ఘోర ప్రమాదం కలకలం రేపింది. సెల్వాస్లోని దేమానీ రోడ్డులో ఉన్న నైట్రోజన్ గ్యాస్ గిడ్డంగిలో (శనివారం) 04 ఏప్రిల్ ఉదయం భారీ పేలుడు సంభవించి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో 5 మంది తీవ్రంగా గాయపడగా, వారిని తక్షణ చికిత్స కోసం సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రశాంతంగా సాగుతున్న పనులు ఒక్కసారిగా విషాదంగా మారడంతో స్థానికంగా తీవ్ర ఆందోళన నెలకొంది.
ఉదయం సమయంలో గిడ్డంగిలో కార్మికులు నైట్రోజన్ గ్యాస్ సిలిండర్లను నింపుతున్న సమయంలో ఒక్కసారిగా ఒక సిలిండర్ పేలిపోయింది. ఆ పేలుడు తీవ్రతకు గిడ్డంగిలోని భాగం దెబ్బతిని, శిథిలాలు బయటకు ఎగిరిపడి రోడ్డుపై చెల్లాచెదురయ్యాయి. పేలుడు ధాటికి చుట్టుపక్కల ప్రాంతాల్లో బలమైన ప్రకంపనలు సంభవించాయి. శబ్దం సుమారు 30 మీటర్ల దూరం వరకు వినిపించిందని స్థానికులు తెలిపారు. ఆ సమయంలో అక్కడి నుంచి వెళ్తున్న పాఠశాల విద్యార్థులు, స్థానిక నివాసితులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కొందరు భూకంపంలాంటి అనుభూతి కలిగిందని కూడా చెప్పారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసి ఆసుపత్రులకు తరలించారు. మృతుల్లో గిడ్డంగి మేనేజర్ కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై ప్రాథమిక విచారణలో భద్రతా ప్రమాణాల పాటించడంలో లోపాలు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. ముఖ్యంగా సిలిండర్ రీఫిల్లింగ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎంతవరకు పాటించబడినాయి, నిర్లక్ష్యం ఏ మేరకు కారణమైందన్న అంశాలపై విచారణ కొనసాగుతోంది. ఈ ప్రమాదం గ్యాస్ గిడ్డంగుల్లో భద్రతా ప్రమాణాల అవసరాన్ని మరోసారి గుర్తు చేస్తోంది.
ALSO READ: బానెడు పొట్ట కూడా మటాష్ అవ్వాలంటే.. రాత్రంతా పులియబెట్టి పొద్దున్నే తాగండి
