Saturday, February 21, 2026
HomeతెలంగాణMunicipal Elections: బీ ఫారం వివాదం.. జిల్లా అధ్యక్షులపై తీవ్ర ఆరోపణలు

Municipal Elections: బీ ఫారం వివాదం.. జిల్లా అధ్యక్షులపై తీవ్ర ఆరోపణలు

Municipal Elections: ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయ వర్గాల్లో సంచలన ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పార్టీ అభ్యర్థులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసినట్లు ప్రచారం ఊపందుకుంది. పార్టీ తరఫున పోటీ చేసే వారికి తప్పనిసరిగా ఇవ్వాల్సిన బీ ఫారం జారీ ప్రక్రియలో అక్రమ వసూళ్లు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అభ్యర్థులకు అధికారిక గుర్తింపు దక్కే కీలక పత్రాన్ని ఇవ్వడానికి లక్షల్లో డబ్బులు వసూలు చేశారనే వార్తలు పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశమయ్యాయి. అడిగిన మొత్తం చెల్లించిన వారికి మాత్రమే బీ ఫారం అందించారని, లేనిపక్షంలో మరో అభ్యర్థికి అవకాశం ఇస్తామని హెచ్చరించినట్లు పలువురు వాపోతున్నారు.

పార్టీ గుర్తింపు కోసం బీ ఫారం తప్పనిసరి కావడంతో అభ్యర్థులు తీవ్ర ఒత్తిడికి గురైనట్లు తెలుస్తోంది. ఎన్నికల నియమావళి ప్రకారం ఆ పత్రం సమర్పించినప్పుడే ఆయా అభ్యర్థులను అధికారికంగా పార్టీ అభ్యర్థులుగా ప్రకటిస్తారు. గడువు సమయం దగ్గరపడే సరికి చాలా మంది చివరి రోజునే బీ ఫారం సమర్పించే పరిస్థితి ఉంటుంది. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని కొందరు జిల్లా అధ్యక్షులు ఒక్కో అభ్యర్థి నుంచి 3 లక్షలు వసూలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొత్తం అందిన తర్వాతే పత్రం అందించారని, డబ్బులు ఇవ్వలేమని చెప్పిన వారికి ఆలస్యం చేస్తూ మానసిక ఒత్తిడి తెచ్చారని చర్చ జరుగుతోంది. గడువు దాటితే స్వతంత్ర అభ్యర్థులుగా గుర్తింపు వచ్చే ప్రమాదం ఉండటంతో చాలామంది అడిగినంత మొత్తాన్ని చెల్లించక తప్పలేదని అంటున్నారు.

కొన్ని ప్రాంతాల్లో మరింత తీవ్ర పరిస్థితులు నెలకొన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతంలోని 2 నుంచి 3 మున్సిపల్ సంస్థల పరిధిలో ఈ వసూళ్లు బహిరంగంగానే జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కూడా కొందరు అధ్యక్షులు 2 లక్షల వరకు రుసుము నిర్ణయించి వసూలు చేసినట్లు చర్చ సాగుతోంది. డబ్బులు ఇవ్వనివారికి మరోకరికి బీ ఫారం ఇస్తామని బెదిరింపులు చేసిన ఘటనలు ఉన్నాయని అంటున్నారు.

ఇక మరోవైపు ఎన్నికల ఖర్చుల వ్యవహారం కూడా చర్చనీయాంశమైంది. అభ్యర్థుల ఎన్నికల వ్యయాల్లో మెజారిటీ భాగాన్ని ప్రభుత్వంలోని కీలక నాయకులు భరించినట్లు సమాచారం. సమన్వయ బాధ్యతలను మంత్రులకు అప్పగించడంతో జిల్లా అధ్యక్షుల ప్రత్యక్ష ప్రమేయం తగ్గిపోయిందని అంటున్నారు. అయితే బీ ఫారం జారీ అధికారాన్ని తమ చేతుల్లో ఉంచుకుని కొందరు తెలివిగా వ్యవహరించి ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. డబ్బులు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించిన అభ్యర్థులకు, తమ పదవులు కూడా ఖర్చు పెట్టి సంపాదించుకున్నవేనని, పైస్థాయిలో ఖర్చులు చేసి పదవులు పొందామని, ఆ మొత్తాన్ని ఎలా రాబట్టుకోవాలన్న సమాధానం ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

ఈ పరిణామాలతో విసిగిపోయిన కొందరు అభ్యర్థులు ఉన్నత నాయకత్వం దృష్టికి విషయాన్ని తీసుకెళ్లినా పెద్దగా స్పందన రాలేదని చెబుతున్నారు. ఎన్నికల హడావుడి ముగిసిన తర్వాత ఓడిపోయిన పలువురు నాయకులు సరైన సమయం చూసుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ వద్ద ఫిర్యాదు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ వ్యవహారం పార్టీ లోపల చర్చనీయాంశంగా మారి భవిష్యత్ రాజకీయ పరిణామాలపై ప్రభావం చూపే అవకాశముందని పలువురు భావిస్తున్నారు.

ALSO READ: Alert: రాష్ట్రంలో రేపటి నుంచి వర్షాలు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments