
కోటిన్నర మంది హైదరాబాదీలకు గుండె గుబేల్ మనే వార్త. హైదరాబాదీలకు తాగునీటి గండం ముంచుకొస్తోంది. మహానగరానికి తాగునీరు అందించే మంజీరా బ్యారేజీ ప్రమాదంలో పడింది. బ్యారేజీ పిల్లర్లకు పగుళ్లు వచ్చాయి. నీటి పారుదల శాఖ నిర్లక్ష్యంతో ప్రమాదంలో పడింది జంట నగరాలకు మంచి నీరు అందించే బ్యారేజీ. మరమ్మతులు చేయకపోవడంతో కొట్టుకుపోయింది మంజీరా బ్యారేజీ ఆప్రాన్.
ఈ సంవత్సరం మార్చి 22వ తేదీన మంజీరా బ్యారేజీని పరిశీలించి, బ్యారేజీ నిర్వహణ, పర్యవేక్షణ లోపాల గురించి పూర్తి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందించింది ఎస్డీఎస్వో. అయితే నివేదిక అందినప్పటికీ, ఎలాంటి చర్యలు తీసుకోలేదు రాష్ట్ర ప్రభుత్వం. హైదరాబాద్ జంట నగరాలతో పాటు చుట్టూ ఉన్న గ్రామాలకు మంచినీరు అందించే మంజీరా బ్యారేజీ ప్రమాదంలో ఉందని, వెంటనే మరమ్మతులు చేయకపోతే భవిష్యత్తులో తీవ్ర నష్టం జరుగుతుందని తేల్చి చెప్పింది రాష్ట్ర ఆనకట్టల భద్రతా సంస్థ(ఎస్డీఎస్వో).
బ్యారేజీ పిల్లర్లు(పియర్లు) కొట్టుకుపోయాయని, తుమ్మ చెట్లు పెరగడంతో మట్టికట్ట బలహీనపడిందని, ఆప్రాన్ కొట్టుకుపోవడంతో బ్యారేజీ దిగువన భారీ గుంతలు ఏర్పడ్డాయని నివేదికలో పేర్కొంది ఎస్డీఎస్వో. ఏ క్షణమైనా మిగిలిన ఆప్రాన్ కొట్టుకపోవొచ్చని, అడవిని తలపించేలాగా తుమ్మ చెట్లు పెరగడంతో పూర్తి స్థాయిలో కట్టలను పరిశీలించలేకపోయామని తెలిపింది ఎస్డీఎస్వో. గేట్ల సీలింగ్ సరిగ్గా లేదని, భారీగా లీకేజీలు కనిపిస్తున్నాయని, బ్యారేజీ పూర్తిగా దెబ్బతిన్నట్లు కనిపిస్తుందని తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచింది ఎస్డీఎస్వో
బ్యారేజీ పునరుద్ధరణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై పూణేలోని కేంద్ర నీటి, విద్యుత్ పరిశోధన కేంద్రం (సీడబ్ల్యూపీఆర్ఎస్) ఆధ్వర్యంలో పర్యవేక్షణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.