- రిటైర్డ్జడ్జీ నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేయాలి
- రాష్ట్రంలో గంజాయి, మాదకద్రవ్యాల ప్రభావం పెరిగింది
- రాష్ట్రంలో ప్రజలు ఆందోళనలో ఉన్నారు
- మాజీ పార్లమెంటు సభ్యులు పెనుమల్లి మధు
తిరుపతి, క్రైమ్ మిర్రర్: ఏడేళ్ల పసిపాపపై అత్యాచారం జరిపి, దారుణంగా హత్య చేసిన ఘటనలో నిందితుడు డ్రగ్స్ స్వీకరించి ఉన్నారన్న వార్త తీవ్ర ఆందోళన కలిగిస్తున్నదని సిపిఎం మాజీ రాజ్యసభ సభ్యులు పెనుమల్లి మధు అన్నారు. తిరుపతి సిపిఎం కార్యాలయంలో బుధవారం ఆయన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
రాష్ట్రంలో పెరిగిపోతున్న డ్రగ్ ప్రభావం గురించి ప్రజలు ఆందోళనతో ఉన్నారన్నారు. స్కూళ్లు, కళాశాలల వద్ద డ్రగ్స్ అమ్మకాలు పెరిగాయని వివరించారు. 7 ఏళ్ల పసిపాపను సైతం కన్ను మిన్ను కానకుండా అత్యాచారానికి పాల్పడడం వెనుక గంజాయి ప్రభావం ఉందని గుర్తు చేశారు.
రాష్ట్రంలో గంజాయి, మాదకద్రవ్యాల కారణంగా హత్యలు, అత్యాచారాలు, దాడులు సంఖ్య పెరిగిందని ఆరోపించారు. డ్రగ్స్ మాఫియా తీవ్రత అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణం పున్నయ్య కమిషన్ తరహాలో రిటైర్డ్ జడ్జితో కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
. తాజాగా అనకాపల్లి పట్టణంలో 1000 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుందన్నారు. విశాఖ జైలులో మాదకద్రవ్యాల నిందితులతో జైలు సామర్థ్యాన్ని మించి నిండిపోయిందని స్వయంగా జైలు సూపరిండెంట్ ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు.
టన్నుల కొద్ది గంజాయి నిల్వలు దొరుకుపోతున్నాయంటే రాష్ట్రంలో నేరస్తుల ప్రభావం ఎలా ఉందో అర్థమవుతుందని, రాష్ట్ర ప్రభుత్వం తక్షణం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఎం తిరుపతి జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు, నేతలు కందారపు మురళి, టి.సుబ్రమణ్యం పాల్గొన్నారు.
