
వరంగల్ కాంగ్రెస్లో ఆధిపత్య పోరు భగ్గుమంటోంది. కొండా వర్గం ఓవైపు ఉంటే… స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు మరోవైపు ఉన్నారు. కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్రెడ్డిపై కొండా మురళి చేసిన వ్యాఖ్యలు ఓరుగల్లులో రాజకీయం భగ్గుమనేలా చేశాయి. పార్టీ మారిన నేతలు రాజీనామా చేయాలని కొండా మురళి అన్నారు. అంతేకాదు.. కొంతమంది నేతలు టీడీపీలో పదవులు అనుభవించి.. ఆ పార్టీని భ్రష్టుపట్టించారని.. ఆ తర్వాత కేసీఆర్ చెంత చేరి ఆయన్ను తప్పుదోవ పట్టించారన్నారు. కొండా మురళి వ్యాఖ్యలపై స్థానిక ఎమ్మెల్యేలంతా ఫైరవుతున్నారు. దీంతో… నాయిని రాజేందర్రెడ్డి ఇంట్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, నేతలు ప్రత్యేకంగా సమావేశమై.. పార్టీకి నష్టం కలిగించే వ్యాఖ్యలు చేసినా సహించేదిలేదన్నారు. కొండాను భరించడం తమ వల్ల కాదని నిర్ణయించుకుని… టీపీసీసీకి ఫిర్యాదు చేశారు. దీంతో… పరిశీలకులను నియమించింది పార్టీ. నివేదిక వచ్చిన తర్వాత తగిన చర్యలు చేపడతామని తెలపింది.
వరంగల్ జిల్లాలో కొండా దంపతులపై వ్యతిరేకత పెరుగుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉండగా… జనగామ తప్పితే మిగిలిన 11 స్థానాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే గెలిచారు. వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి కొండా సురేఖ విజయం సాధించారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే… కొండా దంపతులకు, స్థానిక ఎమ్మెల్యేలకు మధ్య ముందు నుంచీ మంచి రిలేషన్ లేదు. కొండా సురేఖ మంత్రి అయ్యాక… ఆ విభేదాలు మరింత ముదిరాయి. దీంతో… కొండా దపంతులు ఓ వర్గం… మిగిలిన 11 మంది ఎమ్మెల్యేలు మరో వర్గం అన్నట్టు అక్కడ రాజకీయం సాగుతోంది.
Also Read : జూనియర్ ఎన్టీఆర్ని అందుకే దూరం పెట్టాం – నిజాలు బయటపెట్టిన పురందేశ్వరి
పరకాల నియోజకవర్గం.. గతంలో కొండా సురేఖ ప్రాతినిద్యం వహించిన నియోజకవర్గం. గత ఎన్నికల్లో రేవూరి ప్రకాష్రెడ్డి గెలిచారు. ఆ మరుసటి రోజు నుంచే వీరి మధ్య పొలిటికల్ వార్ మొదలైంది. వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డితో కూడా కొండా దంపతులు ఢీ అంటే ఢీ అంటున్నారు. భద్రకాళి అమ్మవారి బోనాల విషయంలోనూ వీరి మధ్య… మాటల యుద్ధం జరిగింది. అమ్మవారికి బంగారు బోనం సమర్పించాలని మంత్రి కొండా సురేఖ నిర్ణయించారు. అయితే… అమ్మవారి గుడి అపవిత్రం చేయొద్దని.. ఆగమశాస్త్రం ప్రకారం భద్రకాళికి బోనం ఉండదని, తరాలుగా వస్తున్న ఆచారాలు, సంప్రదాయాలను మార్చొద్దని నాయిని అన్నారు. దీనిపై పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు. ఈ వివాదం ముదరడంతో… భద్రకాళి అమ్మవారి బోనాలను వాయిదా వేశారు మంత్రి కొండా సురేఖ. కొంత మంది కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని.. గొడవలు సృష్టించాలని చూస్తున్నారని.. అందుకే వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారామె.
Also Read : ట్రాఫిక్ క్లియర్ చేసిన చండూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్.
ఇక… భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యతో అయితే కొండా దంపతులకు ఎప్పటి నుంచో వైరం ఉంది. వరంగల్ మేయర్ గుండు సుధారాణితోనూ కొండా దంపతులకు సఖ్యత లేదు. వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు అంతా.. కొండా దపంతులపై మండిపడుతున్నారు. వాటిపై వేటు వేయాలని అధిష్టానానికి ఫిర్యాదు కూడా చేశారు. టీపీసీసీ పరిశీలకులను కూడా నియమించింది. ఈ పరిస్థితి… ఎటు దారి తీస్తుందో.. ఓరుగల్లు రాజకీయం… ఎంత కాలం భగ్గుమంటుందో చూడాలి.