ఆంధ్ర ప్రదేశ్

లక్షన్నర క్యూసెక్కుల వరద.. శ్రీశైలం డ్యాం గేట్లు ఓపెన్!

కృష్ణమ్మ ఉప్పొంగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల ప్రాజెక్టు నుంచి లక్షా ఇరవై వేల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది.శ్రీశైలం జలాశయం నీటిమట్టం 861.70 అడుగులు కాగా.. ప్రస్తుతం నీటి నిల్వ 111 టీఎంసీలుగా నమోదైంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 కాగా. ప్రస్తుతం 861 అడుగులుగా ఉంది. రాబోయే 2,3 రోజులు భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో వరద పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.వరద ఇలాగే కొనసాగితే రెండు, మూడు రోజుల్లో శ్రీశైలం డ్యాం గేట్లు తెరవనున్నారు అధికారులు

అటు ఎగువన ఉన్న ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. లక్ష క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా అధికారులు డ్యాం 15 గేట్లను తెరిచారు. దిగువకు 51వేల 779 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. విద్యుదుత్పత్తికి 32వేల 169 క్యూసెక్కులు, ఎత్తిపోతలకు నీటిని విడుదల చేస్తుండగా.. మొత్తం 85 వేల 805 క్యూసెక్కులు అవుట్‌ఫ్లో నమోదైంది. డ్యాం పూర్తిస్థాయి సామర్థ్యం 9.6 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జూరాల నుంచి విడుదల చేస్తున్న చేస్తున్న వరద శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుకుంటోంది.

తుంగభద్ర డ్యాంకుకు ఇన్‌ఫ్లో 24,600 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 197 క్యూసెక్కులుగా నమోదైనట్టు అధికారులు తెలిపారు. ఆర్డీఎస్‌ ఆనకట్టకు వరద స్వల్పంగా ఉండగా.. ఇన్‌ఫ్లో 226 క్యూసెక్కులు ఉన్నది. దిగువన ఉన్న సుంకేసుల బరాజ్‌కు 208 క్యూసెక్కులు చేరుతుండగా.. ఆర్డీఎస్‌ ప్రధాన కాల్వకు 355 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. అటు భీమా ప్రాజెక్టు కు 650 క్యూసెక్కులు, కోయిల్ సాగర్ ప్రాజెక్టు కు 315 క్యూసెక్కుల నీటిని ఎత్తి పోస్తున్నారు. ఎడమ కాలువ ద్వారా 550 క్యూసెక్కులు,కుడి కాలువ ద్వారా 298 క్యూసెక్కుల నీటిని సాగు నీటి, త్రాగు నీటి అవసరాల కోసం అధికారులు నీటిని వదులుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button