
ITI Student: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో హృదయ విదారక సంఘటన చోటుచేసుకుంది. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో ఒంటరిగా ఉన్న ఓ యువకుడు ప్రాణాలు తీసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. గర్ల్ఫ్రెండ్కు వీడియో కాల్ చేసి, లైవ్లోనే ఉరి వేసుకోవడం విషాదాన్ని మరింత తీవ్రతరం చేసింది. ఈ ఘటన మేడిపల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని బోడుప్పల్ ప్రాంతంలో జరిగింది. ఒక్కసారిగా జరిగిన ఈ పరిణామం కుటుంబాన్ని, స్నేహితులను, పరిసర ప్రాంత ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసింది.
పోలీసుల వివరాల ప్రకారం.. బోడుప్పల్లోని అయ్యప్ప దేవాలయం సమీపంలో నివసిస్తున్న ఓ ప్రైవేట్ ఉద్యోగి కుటుంబంలో ఈ విషాదం చోటుచేసుకుంది. ఆ కుటుంబానికి చెందిన గంగాధరి అభినవ్ (17) స్థానిక కాలేజీలో ఐటీఐ చదువుతున్నాడు. చదువుతో పాటు భవిష్యత్తు లక్ష్యంగా మేడిపల్లిలోని మహేంద్ర కార్ షోరూంలో ప్రాక్టికల్ ట్రైనింగ్ కూడా చేస్తున్నాడు. సాధారణంగా ఉత్సాహంగా ఉండే అభినవ్ ఇలా ఆకస్మికంగా ఈ నిర్ణయం తీసుకోవడం అందరినీ షాక్కు గురిచేసింది. ఫిబ్రవరి 5న రాత్రి షాపింగ్ నిమిత్తం తల్లిదండ్రులు బయటకు వెళ్లిన సమయంలో అభినవ్ ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు.
అప్పటికే తనతో చదువుతున్న క్లాస్మేట్ అయిన యువతికి వీడియో కాల్ చేసిన అభినవ్.. ఏం కారణమో తెలియకుండానే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఆమెకు చెప్పినట్లు తెలుస్తోంది. వీడియో కాల్ కొనసాగుతుండగానే చున్నీతో ఉరి వేసుకుంటున్న దృశ్యాన్ని ఆమె గమనించింది. ఒక్కసారిగా భయాందోళనకు గురైన ఆ యువతి వెంటనే అభినవ్ స్నేహితులకు సమాచారం అందించింది. విషయం తెలిసిన స్నేహితులు ఆలస్యం చేయకుండా అతని ఇంటికి పరుగెత్తారు. తలుపులు లోపల నుంచి మూసి ఉండటంతో వాటిని బలవంతంగా పగలగొట్టి లోపలికి ప్రవేశించారు.
అప్పటికే అభినవ్ ఉరి వేసుకుని కొన ఊపిరితో ఉండగా, స్నేహితులు వెంటనే అతన్ని కిందికి దించి సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు అత్యవసర చికిత్స అందించినప్పటికీ పరిస్థితి విషమించడంతో శుక్రవారం రాత్రి అతను కన్నుమూశాడు. ఈ విషాదవార్త కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచెత్తింది. తల్లిదండ్రులు ఇంటికి చేరుకుని చూసిన దృశ్యం వారిని మాటరానీయకుండా చేసింది. ఒకే కుమారుడిని కోల్పోయిన తల్లిదండ్రుల రోదనలు స్థానికులను కలచివేశాయి.
సమాచారం అందుకున్న మేడిపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. యువకుడు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు? వ్యక్తిగత సమస్యలేమైనా ఉన్నాయా? లేదా మరేదైనా ఒత్తిడి కారణమా? అన్న కోణాల్లో పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఆదివారం రాత్రి కేసు వివరాలను మీడియాకు వెల్లడించిన పోలీసులు అన్ని అంశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. యువతలో పెరుగుతున్న మానసిక ఒత్తిళ్లు, భావోద్వేగ సమస్యలు ఇలాంటి ఘటనలకు దారితీస్తున్నాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. చిన్న చిన్న విభేదాలు, ఆవేశపూరిత నిర్ణయాలు కుటుంబాలను జీవితాంతం మానని గాయాలతో మిగులుస్తున్నాయి.
ALSO READ: Kuber: వీర్యంతో నెలకు రూ.20 లక్షల ఆదాయం









