అన్నమయ్య, క్రైమ్ మిర్రర్: ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందుతున్నప్పటికీ కొన్నిసార్లు ఊహించని దారుణాలు జరుగుతున్నాయి.తల్లికి వందనం డబ్బు కోసం క్షణికావేశంతో భార్యను భర్త గొంతుకోసి హత్య చేశాడు. అన్నమయ్య జిల్లా పిటియం మండలం రాపూరివారిపల్లి పంచాయతీ కొత్తపల్లి సమీపంలో చోటుచేసుకుంది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేపింది. . రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసిన తల్లికి వందనం డబ్బు వివాదం హత్య ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. కొత్తపల్లికి చెందిన సురేష్ మరియు పద్మావతి దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు ప్రణీత్ ఐదో తరగతి చదువుతుండగా చిన్న కుమారుడు విష్ణు మూడో తరగతి చదువుతున్నాడు. అయితే పేద కుటుంబాల సంక్షేమం కోసం ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సహాయం వారింట తీవ్ర విషాదాన్ని నింపింది.
Also Read:70 ఏళ్ల వృద్ధురాలిపై అఘాయిత్యం, ఇద్దరు నిందితుల అరెస్ట్
ఇటీవల ప్రభుత్వం విద్యార్థుల తదుపరి చదువుల నిమిత్తం నగదును తల్లుల ఖాతాల్లో జమ చేసింది. ఈ క్రమంలో ఆ డబ్బులు తమ కుటుంబ అవసరాలకు వాడుకోవాలని సురేష్ భావించాడు. కానీ పద్మావతి మాత్రం ఆ డబ్బులు ఇవ్వడానికి ససేమిరా ఒప్పుకోలేదు. దీంతో వారిద్దరి మధ్య చిన్నగా ప్రారంభమైన వివాదం పెద్దదైంది. డబ్బులు ఇవ్వమని భర్త పదే పదే ఒత్తిడి తెచ్చినా భార్య మాత్రం అస్సలు అంగీకరించలేదు. ఈ ఆర్థిక అంశం వారి కాపురంలో చిచ్చు పెట్టింది. క్షణికావేశంలో భర్త తీసుకున్న నిర్ణయం పద్మావతి ప్రాణాలను బలిగొంది. కట్టుకున్న భార్య అని చూడకుండా కసితీరా ఆమెను కడతేర్చాడు. ఈ దారుణ ఘటనతో ఆ గ్రామంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతురాలి తల్లి కళావతి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు.
