
Harsh Goenka On Trump Tariffs: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పై ప్రతీకార పన్నుల విధింపుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారత్ కు ఎవరికీ తలవంచబోదని , భారత సార్వభౌమాధికారంపై ఎవరూ సుంకాలు విధించలేరని ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా తేల్చి చెప్పారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందనే కారణంతో భారత్ ఎగుమతులపై ట్రంప్ పన్నులను 50 శాతానికి పెంచడంపై.. గోయెంకా ఎక్స్ ద్వారా స్పందించారు. మెరుగైన ప్రత్యామ్నాయలను కనిపెట్టి మరింత అభివృద్ధి సాధిస్తామన్నారు. “మా ఎగుమతులపై మీరు సుంకాలు విధించగలరు. కానీ, మా సార్వభౌమాధికారంపై మాత్రం కాదు. మేం డిస్కౌంట్లనే ఎంచుకుంటాం. మీ ఆదేశాల ఒత్తిడి కంటే మాకు ఇంధన భద్రతే ముఖ్యం. మీరు సుంకాలను పెంచండి. మేం సంకల్పాన్ని పెంచుకుంటాం. మెరుగైన ప్రత్యామ్నాయలను కనుగొని మరింత రాణిస్తాం. భారత్ ఎవరికీ తలవంచదు” అని హర్షా గోయెంకా ట్వీట్ చేశారు.
ట్రంప్ తీరుపై సర్వత్రా విమర్శలు
అటు ట్రంప్ విధిస్తున్న ఈ సుంకాల వల్ల అమెరికాయే ఆర్థికంగా నాశనం అవుతుందని ఆర్థిక రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. రిపబ్లికన్లు కూడా ట్రంప్ తీరుపై నిప్పులు చెరుగుతున్నారు. సుంకాల పేరుతో భారత్ లాంటి మంచి మిత్రదేశాన్ని దూరం చేసుకోకూడదంటున్నారు. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్న చైనాను కాదని భారత్ పై సుంకాలు పెంచడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు చేస్తున్న భారత్పై అదనంగా మరో 25 శాతం టారిఫ్ విధిస్తూ ట్రంప్ ప్రకటించారు ఈ నేపథ్యంలో భారత్ నుంచి దిగుమతి అయ్యే ఉత్పత్తులపై అమెరికాలో 50 శాతం సుంకం అమలు కాబోతోంది. ఇటీవల విధించిన 25 శాతం పన్ను ఆగస్టు 7 నుంచి అమల్లోకి రాబోతుండగా, ఈ కొత్త పన్నులు ఆగస్టు 27 నుంచి అమల్లోకి రాబోతున్నట్లు అమెరికా తెలిపింది.
Read Also: అమెరికా చర్యలకు తగిన జవాబిస్తాం.. సుంకాల పెంపుపై భారత్ ఆగ్రహం!