వివాహేతర సంబంధం.. దారుణం..!

  • వివాహేతర సంబంధం.. దారుణం..
  • తల్లీబిడ్డలను సజీవ దహనం చేసిన కిరాతకురాలు
  • వివరాలు వెల్లడించిన నాంపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ దూది రాజు..

​నాంపల్లి(క్రైమ్ మిర్రర్):- నాంపల్లి మండలం, కేతపల్లి గ్రామంలో జనవరి 31న జరిగిన దారుణ హత్య ఉదంతం విషాదాంతమైంది. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందన్న కోపంతో ఓ మహిళ, మరో మహిళతో పాటు ఆమె పసికందును కూడా, పెట్రోల్ పోసి నిప్పంటించి, చంపిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ కేసులో ప్రధాన నిందితురాలు మీసాల సుజాత, సోమవారం పోలీసుల ఎదుట లొంగిపోయింది.

అసలేం జరిగింది..!?

పోలీసుల ఇంటరాగేషన్‌లో వెల్లడైన వివరాల ప్రకారం.. నిందితురాలు సుజాతకు అదే గ్రామానికి చెందిన నగేష్‌ యాదవ్ తో, గత కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం నగేష్ భార్య మమతకు తెలియడంతో, కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరిగాయి. పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించగా, నగేష్ తన తప్పు తెలుసుకుని సుజాతను దూరం పెట్టాడు. భార్యాపిల్లలతో కలిసి సంతోషంగా ఉంటున్న నగేష్, సుజాత ఫోన్ కాల్స్ కూడా ఎత్తడం మానేశాడు.

— ​పక్కా ప్లాన్‌తో ఘాతుకం

​నగేష్ తనను దూరం పెట్టడానికి మమతయే కారణమని భావించిన సుజాత, ఆమెను వదిలించుకుంటేనే నగేష్ తనకు దక్కుతాడని పథకం వేసింది. ఈ క్రమంలో ​జనవరి 31న ఒక బాటిల్‌లో పెట్రోల్ కొనుగోలు చేసింది. ​కేవలం పెట్రోల్‌తో పని కాకపోతే ఎలా అనే అనుమానంతో, ఒక సంచిలో కత్తి, కారంపొడిని కూడా వెంట తీసుకెళ్లింది.
​మమత ఇంటి వద్ద ఒంటరిగా ఉన్న సమయంలో, సుజాత ఒక్కసారిగా ఆమెపై పెట్రోల్ పోసి నిప్పు అంటించింది.

— చిన్నారిని కూడా వదలని వైనం

​ఈ ఘోర సంఘటనలో మమతతో పాటు, ఆమె చంకలో ఉన్న చిన్న కుమారుడు అద్విక్ నందన్ కూడా తీవ్రంగా గాయపడ్డారు. మమత అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, కుటుంబ సభ్యులు బాలుడిని ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యలో మృతి చెందాడు. కేవలం తన స్వార్థం కోసం పసి ప్రాణాన్ని కూడా బలితీసుకున్న, సుజాత తీరుపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

— నేరాన్ని అంగీకరించిన సుజాత

కేవలం నగేష్‌ను తన వశం చేసుకోవాలనే ఉద్దేశంతోనే, ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు విచారణలో తేలింది. నిందితురాలిని కోర్టులో హాజరుపరిచి జ్యుడిషియల్ రిమాండ్‌కు తరలిస్తున్నామని, నాంపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ దూది రాజు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button