Rahul Gandhi Faces Disqualification Demand from BJP: లోక్సభలో అనైతికంగా ప్రవర్తించిన కాంగ్రెస్ నాయకుడు, విపక్ష నేత రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ బీజీపీ ఎంపీ నిశికాంత దుబే లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. ఆయన ప్రవర్తనపై దర్యాప్తునకు పార్లమెంటరీ కమిటీని నియమించాలని, దేశాన్ని అస్థిరపరిచేందుకు ఆయన నిరంతరం చేస్తున్న యత్నాలపై విచారణ జరిపించాలని అందులో కోరారు. మరోవైపు రాహుల్పై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం ప్రవేశపెట్టాలని తొలుత భావించినప్పటికీ అలాంటి అవకాశం లేదని బీజేపీ వర్గాలు తెలిపాయి. ఇంకోవైపు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ జరపాలా, వద్దా అనే విషయాన్ని మార్చి 9న నిర్ణయిస్తారని అధికారికంగా వెల్లడయింది.
రాహుల్ పై నిశికాంత దూబె తీవ్ర ఆరోపణలు
రాహుల్ గాంధీపై నిశికాంత దూబె తీవ్ర ఆరోపణలు చేశారు. భారత దేశాన్ని అస్థిరపరిచే దోపిడీ ముఠాతో చేతులు కలిపారని, దేశ సమైక్యత, సమగ్రత, సార్వభౌమ అధికారానికి నష్టం వాటిల్లజేసే చర్యలకు పాల్పడ్డారని తన లేఖలో పేర్కొన్నారు. సైనిక దళాల ప్రతిష్ఠను, ప్రధాని, ఎన్నికల కమిషన్, సుప్రీంకోర్టుల గౌరవాన్ని దిగజార్చారని తెలిపారు. మాజీ సైనిక చీఫ్ నరవణే అప్రచురిత పుస్తకంలోని వాక్యాలను ఉటంకించి ఆయనను కూడా వివాదంలోకి లాగారని ఆరోపించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలను కుప్పకూల్చే సోరోస్ ఫౌండేషన్, ఫోర్డ్ ఫౌండేషన్లతో ఆయన చేతులు కలిపారని విమర్శించారు. బ్యాంకింగ్ వ్యవస్థ కుప్పకూలిందనే దుష్ప్రచారం చేశారని తెలిపారు. రాహుల్ వివిధ దేశాల్లో తరుచూ రహస్య పర్యటనలు చేస్తున్నారని విమర్శించారు. కాగా, రాహుల్ గాంధీ అబద్ధాలకోరు, రౌడీ అని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ఆరోపించారు. అధికారంలోకి రాలేకపోవడంతో దేశంలో అంతర్యుద్ధాన్ని రెచ్చగొడుతున్నారని విమర్శించారు.









