సుమారు 19ఏళ్ల క్రితం ఉమ్మడి ఏపీలో సంచలనం సృష్టించిన అయేషా మీరా హత్యకేసును విజయవాడ సీబీఐ కోర్టు ముగించింది. విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంలోని ఓ హాస్టల్లో 2007లో అయేషా దారుణహత్యకు గురైంది. ఇన్నాళ్లు కొనసాగిన దర్యాప్తు… చివరి దశకు చేరుకుంది. అయేషా భౌతిక అవశేషాలను ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించాలని కోర్టు చెప్పింది. అలాగే ఈనెల 27న వారి మత సాంప్రదాయాల ప్రకారం ప్రభుత్వ భద్రత మధ్య అంత్యక్రియలు నిర్వహించాలని ఆదేశించింది. కాగా, అయేషా హత్యకేసులో నిందితులకు సంబంధించి ఆధారాలు లభించలేదన్న సీబీఐ నివేదికను.. కోర్టు ఆమోదించింది. గాంధీ ఆస్పత్రి వైద్యుల అభిప్రాయం తీసుకున్న తర్వాత… అయేషా అవశేషాలను కోర్టుకు అప్పగించారు. ఈ క్రమంలో తమ కుమార్తె అవశేషాలను తమకు అప్పగించాలని ఆమె తల్లిదండ్రులు పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు… ఈనెల 27న తెనాలిలో అంత్యక్రియలు నిర్వహించాలని ఆదేశించింది. ఈ ప్రక్రియ మొత్తాన్ని సీబీఐ, పోలీసులు, మతపెద్దల సమక్షంలో నిర్వహించాలని, వీడియో రికార్డింగ్ చేయాలని స్పష్టంగా పేర్కొంది.
