-
రైతును సన్మానించిన తోటి రైతులు
-
క్రమంగా ధరలు పెరుగుదల
-
రైతుల కళ్లలో ఆనందం
అనంతపురం,క్రైమ్ మిర్రర్ః అనంతపురం జిల్లా రాయదుర్గం మండలంలోని వడ్రవన్నూరుకు చెందిన తిప్పేస్వామి అనే రైతు డబ్బీ డ్రై మిరపను పండించారు. ఈ మిరప పంటను కర్ణాటకలోని బ్యాడిగి మార్కెట్ తరలించగా రికార్డు స్థాయి ధర పలికింది.
క్వింటాల్ మిర్చి ఏకంగా రూ.87,786 పలికింది. దీంతో రైతును మార్కెట్ అధికారులు, వ్యాపారులు, తోటి రైతులు సన్మానించారు. పూలమాలలు వేసి, స్వీట్లు తినిపించారు. మంచి ధర పలకటంతో మిరప రైతులు సంబరాలు చేసుకున్నారు.మరోవైపు గత రెండేళ్లుగా మిరప రేట్లు చతికిలపడ్డాయి. ఇటీవల మళ్లీ క్రమంగా పెరుగుతున్నాయి.
దీంతో మిరప రైతులు సంతోషంలో ఉన్నారు. మిరపలో రకాన్ని అనుసరించి రెండేళ్లతో పోలిస్తే ఈ సారి నాణ్యత ప్రకారం ఒక్కో రకం మిరప రూ.7000 నుంచి రూ.8000 వరకూ పెరిగింది. దీంతో రైతులు ఆశగా ఉన్నారు. మిర్చి ధరలు నేలచూపులు చూడటంతో రెండు ఏళ్లుగా రైతులు నష్టపోయారు. దీంతో ఈసారి మిరప సాగుకు చాలా మంది రైతులు ఆసక్తి చూపించలేదు.
దీంతో ఉత్పత్తి తగ్గింది. దీనికి తోడు మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలతో పాటు పొరుగు దేశాలైన పాకిస్థాన్, బంగ్లాదేశ్లలోనూ ప్రకృతి వైపరీత్యాలు సంభవించాయి. దీంతో మిరప పంట దిగుబడి మరింత తగ్గింది. దీంతో ఈసారి మిరపకు డిమాండ్ పెరుగుతుందని వ్యాపార వర్గాలు చెప్తున్నాయి.
డబ్బీ డ్రై మిరపకాయలకు ఎందుకింత డిమాండ్…
మరోవైపు డబ్బీ డ్రై మిరపకాయలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. వీటిని కర్ణాటకలోని బ్యాతగిరి ప్రాంతంలో ఎక్కువగా పండిస్తారు. నాణ్యమైన, మంచి రంగును కలిగి ఉంటాయి. తక్కువ కారం, ఎక్కువ సువాసన ఉండటంతో డబ్బీ డ్రై మిరపకాయలకు డిమాండ్ ఎక్కువ. డబ్బీ డ్రై మిరపకాయల పొడిని సాంబార్, పచ్చళ్ల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. వీటిలో కూడా ఏ, ఏప్లస్ గ్రేడ్ అనే రెండు రకాలు ఉంటాయి.
సాంబార్, మసాలా పొడులు, చట్నీలలో ఎక్కువగా ఈ మిరపకాయల పొడిని ఉపయోగిస్తుంటారు. సాధారణ మిరపకాయలతో పోలిస్తే ముదురు ఎరుపు రంగంలో కాస్త లావుగా ఉండటంతో పాటుగా డబ్బా ఆకారంలో ఉండటంతో వీటికి ఆ పేరు వచ్చింది.
