క్రైమ్ మిర్రర్ : ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సంచలనం సృష్టించిన అసిస్టెంట్ ఇంజినీర్ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సాధిక్ను ఉత్తరప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నూకరాజు కుటుంబం ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితుల్లో సాధిక్ పాత్రపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసుతో పాటు గతంలో సంచలనం రేపిన జగదీష్రెడ్డి హత్య కేసులోనూ అతడిపై ఆరోపణలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
సాధిక్పై కాకినాడ జిల్లా సర్పవరం పోలీస్ స్టేషన్తో పాటు రాజమండ్రి టూ టౌన్ పోలీస్ స్టేషన్లోనూ పలు సెక్షన్ల కింద కేసులు నమోదైనట్లు సమాచారం. రెండు కేసులకు సంబంధించి పోలీసులు అతడిని విచారించేందుకు సిద్ధమవుతున్నారు. ఉత్తరప్రదేశ్లో సాధిక్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు తదుపరి చర్యల్లో భాగంగా కాకినాడకు తరలించనున్నట్లు తెలుస్తోంది. అనంతరం నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసు, జగదీష్రెడ్డి హత్య కేసులకు సంబంధించిన అంశాలపై అతడిని విడివిడిగా ప్రశ్నించే అవకాశం ఉంది.
నూకరాజు కుటుంబం ఆత్మహత్యకు అసలు కారణాలు ఏమిటి? సాధిక్కు వారితో ఉన్న సంబంధం ఏంటి? ఆత్మహత్యకు పురికొల్పినట్లు వచ్చిన ఆరోపణల్లో వాస్తవం ఎంత? అనే అంశాలపై పోలీసులు దృష్టి సారించనున్నారు. ఇప్పటికే నమోదైన కేసులకు సంబంధించిన ఆధారాలను సేకరించి, నిందితుడి వాంగ్మూలంతో వాటిని సరిపోల్చే అవకాశం ఉంది. సాధిక్ అరెస్టుతో ఈ కేసు దర్యాప్తులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. రెండు కేసులపై సమగ్ర విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకోనున్నారు.
also read : కుప్పకూలిన 7 అంతస్థుల భవనం…అసలు అనుమతులు ఎవరిచ్చారు…?
