ఒకప్పుడు తెలుగు సినిమాల్లో గ్లామర్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న తాప్సీ పన్ను ప్రస్తుతం బాలీవుడ్లో విభిన్న కథలతో కూడిన సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. సినిమాల విషయంలోనే కాకుండా సామాజిక అంశాలపై కూడా తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్పే తాప్సీ తాజాగా చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.
అందుకే సోషల్ మీడియాకు దూరం
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె సోషల్ మీడియాలో ఎందుకు తక్కువగా కనిపిస్తున్నారనే ప్రశ్నకు స్పందించింది. ప్రస్తుతం చాలా మంది ఎప్పుడూ ఆన్లైన్లో ఉండాలని, ప్రతి ట్రెండ్ను ఫాలో కావాలని భావిస్తున్నారని చెప్పింది. అలాంటి ఒత్తిడి కొన్నిసార్లు మానసికంగా ఇబ్బంది కలిగిస్తుందని పేర్కొంది. అందుకే గత ఏడాది నుంచి సోషల్ మీడియాలో తన యాక్టివిటీని తగ్గించుకున్నట్లు వెల్లడించింది. సోషల్ మీడియాను పూర్తిగా వదిలేయలేదని, అయితే తన జీవితమంతా దాని చుట్టూనే తిరగకూడదని భావిస్తున్నట్లు తాప్సీ తెలిపింది. వ్యక్తిగత జీవితానికి, మానసిక ప్రశాంతతకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని తాను నమ్ముతానని చెప్పింది.
వయసు హీరోయిన్లకే పెరుగుతుందా?
అలాగే సినీ పరిశ్రమలో హీరోయిన్ల వయసు విషయంలో ఉండే వివక్షపై కూడా ఆమె స్పందించింది. ఒక హీరోయిన్కు ఇండస్ట్రీలో స్థిరమైన గుర్తింపు రావడానికి చాలాసార్లు ఐదేళ్లకు పైగా సమయం పడుతుందని, అప్పటికి ఆమె వయసు 30 దాటుతుందని పేర్కొంది. ఆ తర్వాత రొమాంటిక్ పాత్రలకు లేదా ప్రేమకథా చిత్రాలకు ఆమె సరిపోదని కొందరు భావిస్తారని విమర్శించింది. అదే సమయంలో హీరోల విషయంలో మాత్రం ఇలాంటి ప్రమాణాలు ఎందుకు వర్తించవని ప్రశ్నించింది. నటనకు, పాత్రలకు వయసుతో సంబంధం ఉండదని, కానీ మహిళల విషయంలో మాత్రం ఇప్పటికీ వయసును అడ్డంకిగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.
ఈ పరిస్థితి కేవలం బాలీవుడ్కే పరిమితం కాలేదని, దక్షిణాది చిత్ర పరిశ్రమల్లో కూడా ఇలాంటి అభిప్రాయాలు కనిపిస్తాయని తాప్సీ పేర్కొంది. గతంలో కూడా సినీ పరిశ్రమకు సంబంధించిన కొన్ని అంశాలపై ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాలకు దారితీశాయి. తాజాగా చేసిన ఈ వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచింది.